తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు సొంతఊరు నిమ్మకూరులో రాజకీయం రసవత్తరంగా ఉంది. టిడిపి అధికారంలో ఉన్నంత కాలం నిమ్మకూరు పేరు వార్తల్లో ఏదో ఒక సందర్భంలో వినిపిస్తూ ఉండేది. కానీ ఎప్పుడైతే వైసీపీ అధికారంలోకి రావడం జరిగిందో నిమ్మకూరు పేరు పెద్దగా వినపడలేదు.
ఇటువంటి తరుణంలో ఎన్టీఆర్ పుట్టిన సొంత గడ్డ లో భారీ స్థాయిలో వైఎస్ఆర్ విగ్రహాన్ని నిలబెట్టాలని ఇప్పుడు వైసీపీ పార్టీ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు రావడంతో లోకల్ పాలిటిక్స్ ఒక్కసారిగా వేడెక్కాయి. నిమ్మకూరులో టిడిపి క్యాడర్ చాలా బలంగా ఉండటంతో గత పది సంవత్సరాలుగా వైసీపీ విగ్రహాన్ని పెట్టాలని భావించిన సాధ్యం కాలేదు.
కానీ పరిసరాల గ్రామాల్లో మాత్రం వైఎస్సార్ విగ్రహాలు ఉన్నాయి. ఇప్పుడు పామర్రు ఎమ్మెల్యే అనిల్ కుమార్ ఈ విగ్రహాల ఏర్పాట్లను భారీ స్థాయిలో నిమ్మకూరులో చేయాలని అదే పనిలో ఉన్నారట. నిమ్మకూరులో వైఎస్ విగ్రహం పెడితే కచ్చితంగా పార్టీ క్యాడర్ కి బలం ఇచ్చినట్లు ఉంటుందని ఎమ్మెల్యే ఆలోచన చేస్తున్నారట. అంతమాత్రమే కాకుండా ఇటువంటి పని చేస్తే పార్టీలో తన ఇమేజ్ కూడా పెరుగుతుందని ఎమ్మెల్యే భావిస్తున్నారట. వైయస్ జగన్ పాదయాత్రలో భాగంగా అప్పట్లో పామరులు ప్రసంగించిన సమయంలో కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ జిల్లా అనే పేరు పెడతానని చెప్పడం జరిగింది. అలాంటప్పుడు ఎన్టీఆర్ పుట్టిన ఊరిలో వైఎస్ విగ్రహం పెట్టడంలో తప్పులేదు అని వైసీపీ శ్రేణులు తాజా వార్తల పై వ్యాఖ్యానిస్తున్నారు. నిమ్మకూరు గతంలో గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉండేది. అయితే 2009 లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా నిమ్మకూరు పామర్రు నియోజకవర్గ పరిధిలోకి వెళ్ళింది. అప్పటినుండి టిడిపి ఇక్కడ గెలవలేదు. 2014లో పామర్రు నుంచి గెలిచినా ఉప్పులేటి కల్పన తర్వాత టీడీపీలో చేరారు. అయినా 2019 ఎన్నికల్లో మళ్లీ వైసీపీ యే గెలవడం జరిగింది. దీంతో ఏడాదిన్నరగా వైసిపి పార్టీ నిమ్మకూరులో పూర్తి స్థాయిలో పట్టు కోసం పావులు కదుపుతోంది. ఇటువంటి తరుణంలో నిమ్మకూరులో వైయస్ విగ్రహం పెడితే ఓపెన్ అయిపోతుందని ఎమ్మెల్యే అనిల్ భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.