అమరావతి: మూడు రాజధానుల ప్రతిపాదనను విరమించుకోవాలంటూ ముగ్గురు రైతులు అమరావతిలో నిర్మాణంలో ఉన్న ఎమ్మెల్యే క్వార్టర్స్ ఎక్కారు. రాయపూడిలోని ఎమ్మెల్యే క్వార్టర్స్ లో 13వ అంతస్తుకు ఎక్కి నిరసనకు దిగారు. అమరావతిని కోనసాగించాలంటు నినాదాలు చేశారు. రాజధాని కోసం ప్రాణత్యాగానికైనా వెనుకాడేదిలేదని స్పష్టం చేశారు. నిరసనకు దిగిన వారిలో నరసింహస్వామి, చిలక బసవయ్య, చిలక రవి అనే యువకులు ఉన్నారు.
మరోవైపు ఆ ముగ్గురు యువకుల కుటుంబసభ్యులు, బంధువులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాజధాని కోసం తాము పొలాలు ఇచ్చామని, తాము సన్నకారు రైతులమని ఆవేదన వ్యక్తం చేశారు. రాజధాని ఇక్కడి నుంచి తరలివెళితే తాము ఎలా బతకాలని రైతులు ప్రశ్నించారు.