కేరళ: పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) అమలును రాష్ట్రాలు తిరస్కరించే అవకాశమే లేదని ప్రముఖ న్యాయవాది, కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్ అన్నారు. కేరళలో జరుగుతున్న కేరళ లిటరేచర్ ఫెస్టివల్ లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కపిల్ సిబల్ మాట్లాడుతూ పార్లమెంట్ లో ఒకసారి చట్టంగా మారిన తర్వాత అమలు చేయాల్సిందేనని, లేదంటే అది రాజ్యంగ విరుద్ధ చర్య అవుతుందని అభిప్రాయపడ్డారు. చట్టాన్ని అమలు చేయము అని చెప్పే హక్కు రాష్ట్రాలకు లేవన్నారు. అలా అమలు చేయం అని చెప్పడం రాజ్యాంగ విరుద్ధ చర్య అవుతుందని చెప్పారు. అయితే, దీన్ని వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయొచ్చని తెలిపారు. చట్టాన్ని ఉపసంహరించుకోవాలని కేంద్రంపై ఒత్తిడి తీసుకురావొచ్చని చెప్పారు. రాష్ట్రాలు చట్టాన్ని అమలు చేయబోమని మొండికేస్తే తీవ్ర సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందన్నారు. ప్రస్తుతం సీఏఏకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయని, విద్యార్థులు, పేద, అణగారిన వర్గాల ప్రజలే ఆందోళనలకు నేతృత్వం వహిస్తున్నారని కపిల్ సిబల్ చెప్పారు.
సీఏఏని కాంగ్రెస్ సహా విపక్ష పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే కేరళ, పంజాబ్ రాష్ట్రాలు సీఏఏకి వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేశాయి. పౌరసత్వ చట్టాన్ని సవాల్ చేస్తూ కేరళ ప్రభుత్వం సుప్రీం కోర్టును కూడా ఆశ్రయించిన సంగతి తెలిసిందే.
I believe the CAA is unconstitutional
Every State Assembly has the constitutional right to pass a resolution and seek it’s withdrawal
When and if the law is declared to be constitutional by the Supreme Court then it will be problematic to oppose it
The fight must go on !
— Kapil Sibal (@KapilSibal) January 19, 2020
సీఏఏను నిరసిస్తూ దేశంలో అనేక రాష్ట్రాల్లో పెద్దఎత్తున హింసాత్మక ఆందోళనలు కొనసాగుతున్నాయి. పౌరసత్వ సవరణ చట్టం 2019ని అమలు చేయబోమని కేరళతోపాటు పశ్చిమ బెంగాల్, పంజాబ్, మధ్యప్రదేశ్, చత్తీశ్గఢ్ రాష్ట్రాలు ఇప్పటికే ప్రకటించాయి. అసోంలో కూడా ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. ముస్లింలను లక్ష్యంగా చేసుకుని ఈ చట్టాన్ని రూపొందించారని, ఇది రాజ్యాంగంలో పేర్కొన్న లౌకికవాదం, సమానత్వ స్ఫూర్తికి విరుద్ధమని ప్రతిపక్షాలు, చట్టాన్ని వ్యతిరేకిస్తున్న రాష్ట్రాలు ఆరోపిస్తున్నాయి.
కాగా, పాకిస్థాన్, అఫ్ఘానిస్థాన్, బంగ్లాదేశ్ లలో మత పరమైన పీడనకు గురైన అక్కడి మైనార్టీలకు భారత్ లో పౌరసత్వం కల్పించే ఉద్దేశంతో రూపొందించిన చట్టానికి గతేడాది డిసెంబర్ లో పార్లమెంటు ఆమోదం తెలిసిన సంగతి తెలిసిందే. అయితే, ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. జాతీయ పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), జాతీయ పౌర జాబితా (ఎన్ఆర్సి), జాతీయ జనాభా జాబితా (ఎన్పిఆర్)లను నిరసిస్తూ దేశవ్యాప్తంగా ముస్లింలు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు.