YS Sharmila: హత్యా రాజకీయాలను తరిమికొట్టాలని ఏపీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పిలుపునిచ్చారు. కడప లోక్ సభ స్థానం నుండి కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న వైఎస్ షర్మిల తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. వైఎస్ఆర్ జిల్లా బద్వేల్ నియోజకవర్గం కాశినాయన మండలం అమగంపల్లిలో బస్సు యాత్రను ఆమె ప్రారంభించారు. దివంగత మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీత, కాంగ్రెస్ ముఖ్య నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ.. మాజీ మంత్రి వివేకా హత్య కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తికే మళ్లీ వైసీపీ టికెట్ ఇచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. హంతకులను కాపాడుకునేందుకే సీఎం పదవిని జగన్ వాడుకుంటున్నారని విమర్శించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్న సమయంలో కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వ సహకారంతో ఎన్నో అధ్బుత పథకాలను తీసుకొచ్చారన్నారు. రుణ మాఫీ, ఫీజు రీయింబర్స్ మెంట్, జలయజ్ఞం, ఆరోగ్య శ్రీ వంటి ఎన్నో కార్యక్రమాలను అమలు చేశారని అన్నారు.
ప్రత్యేక హోదా తీసుకొస్తానన్న ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు చెప్పిన జగన్ .. అధికారంలోకి వచ్చాక బీజేపీకి తాకట్టు పెట్టారని విమర్శించారు. హోదా వచ్చి ఉంటే రాష్ట్రానికి పరిశ్రమలు వచ్చి ఉండేవన్నారు. రాజధాని లేదు .. పోలవరం పూర్తి కాలేదు..రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని విమర్శించారు. కడపలో స్టీల్ ప్లాంట్ పై ఒక్క అడుగూ ముందుకు పడలేదని అన్నారు. వైఎస్ఆర్ ఉండి ఉంటే అది పూర్తి అయ్యేదని చెప్పారు. ప్రజల భవిష్యత్తు బాగుండాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలన్నారు.
వివేకా హత్య చేయించిన వారికే మళ్లీ వైసీపీ ఎంపీ టికెట్ ఇవ్వడం వల్లనే తాను కడప లోక్ సభ స్థానం నుండి పోటీ చేస్తున్నట్లు తెలిపారు షర్మిల. హంతకులు చట్ట సభలకు వెళ్లకూడదనే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. కడప లోక్ సభ ఎన్నికల బరిలో ధర్మం కోసం ఒక వైపు రాజశేఖరరెడ్డి బిడ్డనైన తాను .. మరో వైపు డబ్బుతో అధికారాన్ని కొందామనుకునే వివేకా హత్య కేసులో నిందితుడు ఉన్నారని, ఎవరిని గెలిపించాలనేది ప్రజలే నిర్ణయించాలన్నారు.
వివేకా కుమార్తె సునీత మాట్లాడుతూ .. ఎంపీగా పోటీ చేస్తున్న వైఎస్ షర్మిలను ప్రజలంతా దీవించాలని కోరారు. తన తండ్రిని చంపిన వాళ్లకు, షర్మిలకు మధ్య పోటీ జరుగుతోందన్నారు. ఆమెను ఎంపీగా చేయాలని వివేకా చివరి కోరిక అని, దాన్ని నెరవేర్చాలని కోరారు. అవినాష్ రెడ్డిని ఓడించాలని సునీత పిలుపునిచ్చారు.
Shanti Swaroop: తొలి తెలుగు న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ ఇక లేరు