ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి షాక్ ఇచ్చారు.
ఓ వైపు సంక్షేమ అభివృద్ధి నిర్ణయాలతో ప్రజల మనసు దోచుకుంటున్న సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోవైపు రాష్ట్ర అభివృద్ధి కోణంలో తీసుకున్న ఓ నిర్ణయం అదే ప్రజలలకు షాక్ ఇచ్చేలా ఉందంటున్నారు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటన దీనికి కారణంగా మారింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోడ్ల అభివృద్దికి పెట్రోల్, డీజిల్ పై ఒక్క రూపాయి సెస్ విదిస్తున్నట్లు రెవెన్యూ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్ భార్గవ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ప్రకటన ఏపీ ప్రజలు జీర్ణించుకోలేనిదని పలువురు పేర్కొంటున్నారు.
కరోనానే కారణమట
కోవిడ్ నియంత్రణలో భాగంగా కేంద్ర హోమ్ శాఖ సూచనల మేరకు గత మార్చి 23 నుండి లాక్ డౌన్ విధించిన కారణంగా ఆర్ధిక కార్యకలాపాలు మందగించి రాష్ట్ర ఆదాయంపై తీవ్ర ప్రభావం పడినట్లు రెవెన్యూ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్ భార్గవ రజత్ భార్గవ తెలిపారు. గత ఏడాది ఏప్రిల్ లో రాష్ట్ర రెవెన్యూ రూ. 4,480 కోట్లు ఉండగా ఈ ఏడాది ఏప్రిల్ లో కేవలం రూ. 1,323 కోట్లు మాత్రమే ఉందన్నారు. అంచనా వేసిన ఆదాయంలో ఇది కేవలం 29.5 శాతం మాత్రమేనని ఆయన తెలిపారు. మే, జూన్, జులై, ఆగస్టు నెలల్లో కూడా పరిస్థితులు ఇందుకు ఏ మాత్రం భిన్నంగా లేవని రజత్ భార్గవ అన్నారు.
మంత్రి మండలి ఆదేశాల వల్లే…
ఒకవైపు రాష్ట్రానికి రావలసిన ఆదాయం తగ్గిపోవడంతో పాటు కోవిడ్-19 పై పోరాటంలో భాగంగా వైద్య, ఆరోగ్య సేవలకు అధిక మొత్తంలో ఖర్చు చేయడం, మరోవైపు అట్టడుగు వర్గాలకు సంక్షేమ పథకాలు అందించడానికి ఖర్చు చేయవలసి రావడంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై ఒత్తిడి పెరిగిందని రెవెన్యూ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్ భార్గవ వెల్లడించారు. ఈ విషయాలన్నింటిని పరిగణనలోకి తీసుకున్న తర్వాత రోడ్ల అభివృద్దికి నిధులు ఖర్చు చేయవలసిన ఆవశ్యకతను దృష్టిలో పెట్టుకొని మంత్రి మండలి నిర్ణయం మేరకు పెట్రోల్, డీజిల్ పై ప్రస్తుతం ఉన్న పన్నులకు అదనంగా రోడ్ల అభివృద్ధికి గాను ఒక్క రూపాయి సెస్ ను విధించిందన్నారు. ఈ మేరకు ఏపీ వాట్ చట్టం 2005 కు సవరణలు చేస్తూ ప్రతిపాదించిన ఆర్డినెన్స్ కు శుక్రవారం గవర్నర్ ఆమోదం తెలిపారని స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్ భార్గవ వెల్లడించారు.
ఈ డబ్బులన్నీ ఏం చేస్తారంటే?
కాగా, మంత్రి మండలి నిర్ణయం మేరకు పెట్రోల్, డీజిల్ పై ప్రస్తుతం ఉన్న పన్నులకు అదనంగా విధించిన ఒక్క రూపాయి సెస్ ఆదాయాన్ని కేవలం రోడ్ల అభివృద్ధి, మౌళిక సౌకర్యాల కల్పనకు వినియోగించనున్నట్లు రజత్ భార్గవ స్పష్టం చేశారు. రోడ్ డెవలప్ మెంట్ సెస్ ద్వారా సంవత్సరానికి రానున్న రూ. 500 కోట్ల ఆదాయాన్ని ప్రత్యేకించి రోడ్ల అభివృద్ధి, మౌళిక సౌకర్యాల కొరకు మాత్రమే వినియోగించేందుకు వీలుగా రోడ్ల డెవలప్ మెంట్ కార్పొరేషన్ కు బదిలీ చేస్తారని ఆయన వివరించారు.