YSRCP: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఈ సారి ఎన్నికల్లోనూ మంగళగిరిలోనే తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీ ఆవిర్భావం తర్వాత రెండు సార్లు మాత్రమే ఆ పార్టీ అభ్యర్ధులు గెలిచారు. 1983, 85 లో ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు గెలిచారు. ఆ తర్వాత 1989, 1999, 2004,2009 లో కాంగ్రెస్ అభ్యర్ధులు, మధ్యలో 1994లో ఒక్క సారి సీపీఐ, 2014,2019లో వరుసగా వైఎస్ఆర్ సీపీ అభ్యర్ధులు గెలిచారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో 5,337 ఓట్ల తేడాతో ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో నారా లోకేష్ పరాజయం పాలైయ్యారు.
రాబోయే ఎన్నికల్లోనూ లోకేష్ ఇక్కడే తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్దమైయ్యారు. అయితే లోకేష్ ను ఈ సారి కూడా ఓడించేందుకు వైసీపీ హైకమాండ్ వ్యూహాన్ని సిద్దం చేసుకుంది. ఈ క్రమంలోనే సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిని తప్పించి మంగళగిరి ఇన్ చార్జిగా బీసీ (చేనేత) సామాజికవర్గానికి చెందిన గంజి చిరంజీవిని నియమించింది వైసీపీ. ఆళ్ల రామకృష్ణారెడ్డికి టికెట్ ఇవ్వకపోవడంతో ఆయన పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా ఆళ్ల రామకృష్ణారెడ్డి పోటీ చేసే అవకాశం ఉంది.
దీంతో మంగళగిరి నియోజకవర్గంలో వైసీపీ, టీడీపీ, కాంగ్రెస్ అభ్యర్ధుల మధ్య త్రిముఖ పోరు నెలకొనే అవకాశం ఉంది. దీంతో లోకేష్, ఆర్కే కు చెక్ పెట్టేందుకు సీఎం జగన్ ప్రత్యేక వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. ఈ క్రమంలో భాగంగా మంగళగిరి నియోజకవర్గ ఎన్నికల ఇన్ చార్జి బాధ్యతలను పార్టీలో నెంబర్ 2 పొజిషన్ లో ఉన్న రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డిని రంగంలోకి దింపినట్లుగా వార్తలు వినబడుతున్నాయి. వైసీపీ అభ్యర్ధి గంజి చిరంజీవి గెలుపునకు విజయసాయి రెడ్డి వ్యూహాలు బాగా పని చేస్తాయని సీఎం జగన్ విశ్వసిస్తున్నారుట.
ఇప్పటికే మంగళగిరి బాధ్యతలు చేపట్టిన విజయసాయి రెడ్డి .. జరగబోయే ఎన్నికల్లోనూ తమ పార్టీ అభ్యర్ధి గంజి చిరంజీవి తప్పక విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఈ నెల 31వ తేదీ మంగళగిరిలో వైసీపీ తలపెట్టిన సామాజిక సాధికార బస్సు యాత్ర ఏర్పాట్లను స్థానిక నేతలతో కలిసి పరిశీలించిన విజయసాయి రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఈ నియోజకవర్గంలో గతంలో టీడీపీ గెలిచిన దాఖలాలు లేవని అన్నారు. వచ్చే ఎన్నికల్లోనూ నారా లోకేష్ ఓటమి తథ్యమని అన్నారు.
వైసీపీ నుండి వెనుకబడిన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి పోటీలో నిలబడుతున్నారని చెప్పారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ వర్గాలకు వైఎస్ జగన్ ఇస్తున్న ప్రాధాన్యత దేశంలో మరే ఇతర రాష్ట్రంలో ఏ పార్టీ ఇవ్వడం లేదని అన్నారు. నియోజకవర్గంలో బీసీ, బడుగు బలహీన వర్గాలకు చెందిన ప్రజలు వైసీపీ అభ్యర్ధిని గెలిపించుకుంటారని, అలానే రాబోయే ఎన్నికల్లో ఆయా వర్గాల ప్రజలు వైఎస్ జగన్ ను మరో మారు ముఖ్యమంత్రిని చేస్తారని నమ్మకంగా చెప్పారు.
మరో పక్క రెండు సార్లు వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచిన ఆళ్ల రామకృష్ణారెడ్డి ఈ సారి కాంగ్రెస్ అభ్యర్ధిగా బరిలో నిలవనుండటంతో మంగళగిరి పోరు రసవత్తరంగా మారనుంది. ఓ పక్క వైసీపీకి, మరో పక్క టీడీపీకి మంగళగిరి నియోజకవర్గం ప్రతిష్టాత్మకంగా మారుతోంది. సీఎం వైఎస్ జగన్ నివాసం ఈ నియోజకవర్గ పరిధిలో ఉండటంతో వైసీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. మరో పక్క లోకేష్ ఈ సారి గెలవకపోతే ఆయన రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్ధకంగా మారుతుంది. రాబోయే రోజుల్లో మూడు పార్టీల వ్యూహాలు ఎలా ఉంటాయో చూడాలి మరి.
Rahul Gandhi: రాహుల్ గాంధీకి షాకిచ్చిన అస్సాం సర్కార్ .. రాహుల్ సహా కాంగ్రెస్ నేతలపై కేసులు నమోదు