YS Jagan: సార్వత్రిక ఎన్నికల షెడ్యుల్ విడుదల అయ్యింది. ఎన్నికల షెడ్యుల్ విడుదలకు గంటల ముందు వైసీపీ లోక్ సభ, అసెంబ్లీ అభ్యర్ధుల జాబితా విడుదల చేసింది. ఒకే సారి 175 అసెంబ్లీ, 24 లోక్ సభ స్థానాలకు అభ్యర్ధులను వైసీపీ ప్రకటించింది. ఇక వైసీపీ అధినేత జగన్ బస్సు యాత్ర ద్వారా జనంలోకి వెళ్లనున్నారు. ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో నాలుగు ప్రాంతాల్లో క్యాడర్ ను ఎన్నికలకు సన్నద్దం చేసేందుకు సిద్దం పేరుతో సభలను నిర్వహించిన వైఎస్ఆర్ సీపీ అధినేత, సీఎం జగన్ ఈ నెల 26 లేదా 27వ తేదీ నుండి బస్సు యాత్రను చేపట్టాలని నిర్ణయించారు.
ఈ బస్సు యాత్ర మొత్తం 21 రోజుల పాటు జరగనుందని పార్టీ కార్యక్రమాల కోఆర్డినేటర్, ఎమ్మెల్సీ తలశిల రఘురామ్ తెలిపారు. ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో మేమంతా సిద్ధం పేరిట జగన్ బస్సు యాత్ర చేపట్టనున్నారని చెప్పారు. సిద్ధం సభలు నిర్వహించిన నాలుగు జిల్లాలు/ పార్లమెంటు నియోజకవర్గాలు మినహా మిగిలిన 21 జిల్లాల్లో బస్సు యాత్ర చేపట్టనున్నట్టు ఆయన ప్రకటించారు. బస్సు యాత్రకు సంబంధించి ప్రణాళికను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రూపొందించిందన్నారు.
తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయం మాజీ మంత్రి పేర్నినానితో కలసి ఈ వివరాలను ఆయన మీడియాకు వెల్లడించారు. ఈ నెల 26 లేదా 27 తేదీన బస్సు యాత్ర ప్రారంభమవుతుందని తెలియచేశారు. ఇప్పటికే పార్టీ శ్రేణులను ఎన్నికల సమరానికి సన్నద్ధంచేసే ప్రక్రియలో భాగంగా సిద్ధం పేరుతో భారీ బహిరంగ సభలు నిర్వహించామన్నారు. రాష్ట్రంలో రీజియన్ల వారీగా నాలుగు జిల్లాల్లో సిధ్దం పేరిట దేశ చరిత్రలోనే ఎన్నడూ జరగని విధంగా బహిరంగసభలు జరిగాయన్నారు. ఆ ప్రాంతాలలో ప్రజలు లక్షలాదిగా తరలివచ్చి జగన్ పరిపాలన పట్ల వారి మధ్దతు ప్రకటించారన్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలోకూడా పార్టీ కార్యకర్తలను, నాయత్వాన్ని సమాయత్తం చేయడానికి “మేము సిధ్దం…మా బూత్ సిధ్దం ” పేరిట కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు.
“మేము సిద్ధం… మా బూత్ సిద్ధం – ఎన్నికల సమరానికి “ మేమంతా సిద్ధం’’ లక్ష్యంతో బస్సుయాత్ర కొనసాగుతుందని చెప్పారు. “ మేమంతా సిద్ధం’’ పేరుతో జరిగే ఈ బస్సు యాత్ర ప్రతిరోజూ ఒక జిల్లాలో/పార్లమెంటు నియోజకవర్గంలో జరుగుతుందన్నారు. ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్ ఉదయం పూట ఇంటరాక్ట్ అవుతారని, ఇందులో భాగంగా ప్రభుత్వం పని తీరును మెరుగుపరిచేందుకు సలహాలు, సూచనలు స్వీకరిస్తారని వెల్లడించారు.
సాయంత్రం ఆ జిల్లా/పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి భారీ బహిరంగ సభ నిర్వహిస్తామన్నారు. బస్సుయాత్ర ప్రారంభం అయిన తర్వాత, యాత్ర పూర్తయ్యేంత వరకూ కూడా జగన్ పూర్తిగా జనంలోనే ఉంటారన్నారు. యాత్రలోనే విడిది చేస్తారని తెలిపారు. ఓదార్పుయాత్ర, ప్రజాసంకల్ప యాత్ర ఎంత ప్రతిష్టాత్మకరంగా నిర్వహించామో, అదే తరహాలో బస్సుయాత్ర నిర్వహిస్తామన్నారు. మేమంతా సిద్ధం పాదయాత్రకు సంబంధించి మరిన్ని వివరాలను రేపు ( మార్చి 19న) మీడియా సమావేశంలో వెల్లడిస్తామని ఆయన చెప్పారు.
RS Praveen Kumar: బీఆర్ఎస్ కు కాస్త ఊరట .. గులాబీ కండువా కప్పుకున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్