విద్యార్థులకు క్రమశిక్షణ నేర్పించాల్సిన ఉపాధ్యాయులే క్రమశిక్షణ తప్పారు. సమాజంలో ఎంతో గౌరవ ప్రదమైన వృత్తిలో ఉన్న వీరు వారి హోదాను మరచిపోయి సహచర ఉపాధ్యాయుడిపై దాడికి తెగబడ్డారు. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో ముగ్గురు ఉపాధ్యాయులు సస్పెండ్ అయ్యారు. ఈ ఘటన గుంటూరు జిల్లా బాపట్ల మండలం అప్పికట్ల జిల్లా జిల్లా పరిషత్ హైస్కూల్ లో మంగళవారం జరిగింది.
వివరాల్లోకి వెళితే..అప్పికట్ల జిల్లా పరిషత్ హైస్కూల్లో పీఈటీగా పని చేస్తున్న వెంకటేష్ అనే ఉపాధ్యాయుడిపై అదే పాఠశాలలో పని చేస్తున్న ఉపాధ్యాయులు జయరావు, బుల్లయ్య, శివయ్యలు దాడి చేసి తీవ్రంగా గాయపర్చారు. గాయపడిన ఉపాధ్యాయులు వెంకటేష్ కు స్థానిక ఆసుపత్రిలో ప్రధమ చికిత్స అనంతరం గుంటూరు ఆసుపత్రికి తరలించారు. బాధిత ఉపాధ్యాయుడు వెంకటేష్ జరిగిన విషయంపై పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, డీఈఓ దుర్గాభవానీకి ఫిర్యాదు చేశారు. ముగ్గురు ఉపాధ్యాయులు తనపై దాడికి పాల్పడ్డారనీ, వారిని కఠినంగా శిక్షించాలనీ పిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై స్పందించిన డీఇఓ దుర్గాభవాని శాఖాపరమైన విచారణకు ఆదేశించారు. దాడికి పాల్పడిన ముగ్గురు ఉపాధ్యాయులను సస్పెండ్ చేశారు.