నేను ప్రతిసారి చెప్తున్నాను.నాకు చాలా చిన్న విషయాలు కూడా అర్థం కావు.
నారు పోసినవాడు నీరు పొయ్యడా అంటారు.
ఎందుకు పోయడు, పోస్తాడు.
కానీ అక్కడ నీరు ఉండాలికదా!
జోక్ అఫ్ ది ఇయర్ ఏవిటంటే ఎంతో పేరున్న నిమ్స్ హాస్పిటల్కి నీరు లేక సర్జరీలు ఆపేసేరుట.
బావుంది కదూ!
మరి అర్జెంటు అయితే ఎలాగే అంది మాఅమ్మ.
ఎలాగేవిటి పోతారు.ఎంత దారుణం!
దారుణం కాదు, వేదాంతం; బతికే యోగం ఉంటే మరోచోటికి పోయేవాడు.
మళ్ళీ మొదటికే వస్తున్నాను.
మా చిన్నతనంలో ఏతాం నూతులు ఉండేవి.
ఎంత పెద్దవంటే అందులో మానాన్న వాళ్ళు ఈత కొట్టేవాళ్ళు.
ఇప్పుడు పల్లె పల్లె కి కరెంటు వచ్చింది.
ఏతాం నూతులు మాయం ఐపోయేయి.
బోర్లు మోటార్లు వచ్చేయి.
ఏవుందీ స్విచ్ వేస్తే నీళ్లు పడుతాయి.
శుభం.
అయితే ఇందులో ఓ తిరకాసు ఉంది.
ఏతాం నుయ్యి యెప్పుడూ ఉంటుంది.
కరెంటు ఎప్పుడూ ఉండదు; స్విచ్ ఉంటుంది; నీరే ఉండదు.
మరంచేత నారు పోసినవాడు నీరు పొయ్యలేడు.
నీరు లేకపోతే పంట చస్తుంది.
పంట లేకపోతే మనం ఛస్తాం.
కాని లేని కరెంటు ఎవరిస్తారు!
ఇళ్ళకి యిస్తే పొలాలకు లేదు.
పొలాలకు ఇస్తే ఇళ్ళకి లేదు.
పొలాలకి ఇస్తామన్నారు కానీ అది చాలలేదు.
మోటార్లు కాలిపోయేయి.
రైతుల కడుపులు కాలిపోయేయి.
బతుకులు బుగ్గి ఐపోయేయి.
అప్పులు తీర్చలేక కొందరు ఆత్మహత్య చేసుకున్నారు.
అదే వాళ్ళ పొరపాటు.
ఎన్ని బడా కంపెనీలు ఎన్ని కోట్లు రూపాయల అప్పుల మీద బతుకుతున్నాయి!
వాళ్లంతా ఆత్మ హత్యలు చేసుకుంటున్నారా లేదే!
అదిగో అక్కడే మన కర్మ సిద్ధాతం ఆదుకుంటుంది.
వాడి కర్మ ఆలా కాలిపోయింది.
కరెంటు ఇవ్వలేదని ఉరేసుకొని; సీటు రాలేదని ఉరేసుకొని; ఇలా ఎంతమంది ఉరేసుకుంటారు?
తెల్లవారి లేచిన దగ్గరనుంచి మనం స్విచ్ మీదే బతుకుతున్నాం.
బద్ధకం పెరిగిపోయింది.
ఆనాటి సంతృప్తి ఈ నాడు లేదు; అది మాత్రం ముమ్మాటికీ నిజం.
అందుకే పాత రోజులు మంచివి.
-బీనా దేవి
ఎల్లో జర్నలిజం నడుమ జాతీయ పత్రికా దినోత్సవం…పత్రికా స్వేచ్ఛ ఒక భ్రమ