లక్నో: ఇప్పటికకే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో పొత్తు కుదుర్చుకున్న ఎస్పీ, బీఎస్పీ పార్టీలు.. ఇప్పుడు మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లోనూ కలిసే ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నాయి. 2019 లోక్సభ ఎన్నికల్లో ఎస్పీ, బీఎస్పీ కూటమి మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లోనూ కొనసాగుతుందని ఆ రెండు పార్టీల అధినేతలు అఖిలేష్ యాదవ్, మాయావతి స్పష్టం చేశారు.
‘మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లోనూ తమ రెండు పార్టీల కూటమి కలిసే పోటీ చేస్తుంది’ అని సమాజ్వాదీ అధినేత అఖిలేష్ యాదవ్, బీఎస్పీ అధినేత్రి మాయావతి సోమవారం సంయుక్త ప్రకటన చేశారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని మూడు స్థానాలు బాలఘాట్, తికమఘర్, ఖజరహో, ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఒక స్థానం గధ్వాల్(పౌరి) నుంచి ఎస్పీ అభ్యర్థులు పొత్తులో భాగంగా పోటీకి దిగనున్నారు.
ఇక ఆ రెండు రాష్ట్రాల్లో మిగితా అన్ని స్థానాల్లోనూ తమ అభ్యర్థులే బరిలో దిగుతారని బీఎస్పీ ప్రకటించింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 29 పార్లమెంటు స్థానాలుండగా, ఉత్తరఖాండ్ రాష్ట్రంలో 5 స్థానాలున్నాయి.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం విషయానికొస్తే 38 స్థానాల్లో బీఎస్పీ పోటీ చేయనుండగా, ఎస్పీ 37 స్థానాల నుంచి తమ అభ్యర్థులను బరిలో నిలపనుంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 80 పార్లమెంటు స్థానాలున్నాయి. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పోటీ చేసే స్థానాల్లో ఈ కూటమి పోటీ పెట్టడం లేదు.