రాజధానిగా అమరావతి తగదని వైసీపీ ప్రభుత్వం వాదిస్తోంది.విశాఖ అన్ని విధాలా రాజధానికి అనువైన దన్నది వైసిపి ప్రభుత్వ భావన!భారీ వర్షాలు కురిస్తే వరద ముంపునకు గురయ్యే ప్రాంతంలో రాజధాని ఎలా ఉంటుందని ఇప్పటిదాకా జగన్ ప్రభుత్వం వాదిస్తూ వచ్చింది.
అయితే ఈ వాదనలో డొల్లతనం ఇప్పుడు బయటపడింది.చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఒక ఎత్తిపోతల పథకం ఆ ప్రాంతాన్ని ముంపు నుండి బయటపడేసింది.కొద్దిగా వెనక్కు వెళితే రాజధాని అమరావతి ముంపు ప్రాంతంలో ఉందని గతంలో హరిత ట్రిబ్యునల్ లో కేసులు వేశారు. దీంతో ముంపు నివారించే పధకం రూపొందించాకే రాజధాని నిర్మాణం పై ముందుకు వెళ్లాలని హరిత ట్రిబ్యునల్ ఆదేశించింది. దీంతో చంద్రబాబు సర్కార్ కొండవీటి ఎత్తిపోతల పధకాన్ని రూ. 237 కోట్లతో పూర్తి చేసి..అమరావతి నిర్మాణాన్ని ప్రారంభించింది.
అయితే ఆ ఎత్తిపోతలను చంద్రబాబు ప్రభుత్వం ఉపయోగించుకునే సందర్భమే రాలేదు.ఇప్పుడు కురిసిన వర్షాలకు వరదల పరిస్థితి ఉధృతం కావడంతో జగన్ ప్రభుత్వం ఆ పథకాన్ని ఉపయోగించింది .ముంపు వచ్చే అవకాశం ఉండటంతో ఎత్తిపోతల మోటర్లను ఆన్ చేశారు. నీటిని కృష్ణానదిలోకి పంప్ చేయడం ప్రారంభించారు. పొలాల్లో నిలబడిన నీరు.. ఎత్తిపోతల ద్వారా కృష్ణాలోకి పంపేస్తున్నారు. దీంతో 20 గ్రామాల రైతులు వేల ఎకరాల పంటపొలాలను వరద ముంపు నుంచి కాపాడగలిగారు. రాజధాని పేరుతో నిర్మించిన కొండవీటి వాగు ఎత్తిపోతల మూలంగా తమకు శాశ్వత పరిష్కారం లభించిందని రైతులు సంతోష పడుతున్నారు.
తద్వారా అమరావతి రాజధానిగా ఉంటే భారీ వరద వచ్చినప్పుడు మునిగి పోతుందన్న వైసిపి ప్రభుత్వ వాదన సత్యదూరమని రుజువైంది.ఒకవేళ వరదలు వచ్చినా దానికి ప్రత్యామ్నాయంగా చంద్రబాబు ప్రభుత్వం ఎత్తిపోతల పథకాన్ని కూడా సిద్ధం చేసింది. .ఆ ఎత్తిపోతల పథకం కూడా సక్సెస్ అయింది. ఇది టీడీపీకి బాగా అనుకూలించే అంశం కాగా ఈ పరిస్థితుల్లో వైసిపి ప్రభుత్వం ఇంకేవిధంగా అమరావతి విషయాన్ని కవర్ చేసుకుంటుందో చూడాలి.