దేశంలో ఏ రాష్ట్రంలోనూ జరగని పరిణామాలు ఏపీలో జరుగుతున్నాయి. రాజ్యాంగబద్ధ వ్యవస్థలు మధ్య అగాధం అంతకంతకూ పెరుగుతోంది. అధికార పార్టీ ముఖ్యనేతలు, సోషల్ మీడియా వ్యవస్థ కూడా న్యాయ వవస్థపై మాటల దాడి చేస్తున్నారు. హైకోర్టులో కూడా అధికారపార్టీ నేతలపై ఆగ్రహజ్వాలలు వ్యక్తమవుతున్నాయి. ఇది దేనికి సంకేతం.. రాష్ట్రం ఏ దిశగా పయనిస్తోంది. ప్రభుత్వం, రాజ్యాంగవ్యవస్థల మధ్య అగాధం రాష్ట్రానికి మేలు చేస్తుందా.. కీడు చేస్తుందా? అన్నింటికీ పెద్దన్నలా ఉండాల్సి కేంద్రం, సుప్రీంకోర్టు ఏం చేస్తున్నట్టు?
అధికార పార్టీ ఆగే అవకాశమే లేదు..
వైసీపీ నేతలు విజయసాయి రెడ్డి, మిధున్ రెడ్డి, నందిగం సురేశ్, స్పీకర్ తమ్మినేని.. తదితర నాయకులు, కార్యకర్తలు కూడా న్యాయ వ్యవస్థపై వ్యాఖ్యలు చేశారు. 19 మంది ఘాటు వ్యాఖ్యలు చేస్తే వారిలో 9 మందినే ఏపీ సీబీఐ కేసులు పెట్టి అరెస్టు చేశారని వ్యాఖ్యలు చేసింది. కోర్టు అధికార పార్టీపై సీరియస్ గానే స్పందిస్తోంది. కానీ.. అధికార పార్టీ ఆగడం లేదు. ప్రజామోదంతో 151 సీట్లు, అధికారం అండ, ఆగ్రహం ఒక్కసారిగా ఆగేవి కావు. స్పీకర్ తమ్మినేని నిన్న కూడా హైకోర్టు వ్యాఖ్యలపై పరోక్షంగా స్పందించారు. టీడీపీ పార్టీకి కొన్ని చురకలు వేశారు. ప్రస్తుతం ఉన్న ప్రజాబలంతో అధికార పార్టీ న్యాయవ్యవస్థకు లొంగే అవకాశం లేదు. సున్నితమైన అంశాల జోలికి వెళ్లకుండా పరోక్ష వ్యాఖ్యలు చేసే అవకాశం ఉంది.
క్షేత్రస్థాయిలో ఏమైనా కదలిక వస్తోందా..?
ఏపీలో ప్రస్తుతం ఈ రెండు వ్యవస్థల మధ్య యుద్ధం జరుగుతోంది. ఈ నేపథ్యంలో సీఎం జగన్ రెండు వారాల క్రితం రెండుసార్లు అమిత్ షాను కలిసారు. రీసెంట్ గా ప్రధాని మోదీని కూడా కలిశారు. దేశంలో, వ్యవస్థలను శాసిస్తున్న ఇద్దరు వ్యక్తులను జగన్ కలిసారు. వీరిమధ్య కోర్టుల అంశం వచ్చే ఉంటుందని.. పరిష్కార మార్గాలు ప్రస్తావనకు వచ్చే ఉంటాయని పరిశీలకు అభిప్రాయం. అయితే.. ఇవి చట్టబద్దంగానా లేక రాజకీయంగానా అనేది తెలియాల్సి ఉంది. హైకోర్టు ఈ వివాదాన్ని సీబీఐకి అప్పగించేందుకు కూడా వెనుకాడక పోవచ్చని అంటున్నారు.