స్థానిక ఎన్నికలు వాయిదా.. సీఎం జగన్ మొదటి ప్రెస్ మీట్, నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తొలగింపు ఆర్డినెన్స్, ఎన్నికల కమిషనర్ గా కనగరాజ్ నియామకం, సుప్రీంకోర్టు వరకూ కేసు వెళ్లడం, ఆర్డినెన్స్ చెల్లవంటూ కోర్టు తీర్పునివ్వడం.. మళ్లీ నిమ్మగడ్డ కుర్చీలో కూర్చోవడం అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు మళ్లీ స్థానిక సంస్థల అంశం మళ్లీ తెరమీదకు వచ్చింది. ఏపీలో స్థానిక ఎన్నికలు జరుగుతాయా.. జరగవా? అనే అనుమానాలు నెలకొన్నాయి. దీనిపై ఇప్పుడు కోర్టు త్వరలోనే నివృత్తి చేయనుంది.
కోర్టులో విచారణ ఏం జరిగిందంటే..
ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికల నిర్వహణపై హైకోర్టులో గతంలో పిటిషన్ దాఖలైంది. దీనిపై హైకోర్టులో విచారణ జరుగుతోంది. ప్రస్తత కరోనా సమయంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. దీనిపై కోర్టు స్పందించింది. ఎన్నికల నిర్వహణపై కరోనా ప్రభావమెంతో రాష్ట్ర ఎన్నికల కమిషన్ చెప్పాలని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఇతర రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తున్న విషయాన్ని హైకోర్టు ప్రస్తావించింది. మరి.. ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికలు ఎందుకు సాధ్యం కాదని హైకోర్టు ప్రశ్నించింది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. దీనిపై విచారణను నవంబర్ 2కి వాయిదా వేసింది.
ప్రభుత్వ వైఖరి ఎలా ఉందంటే..
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధంగా ఉందంటే లేదనే చెప్పాలి. ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఉన్నంత కాలం స్థానిక ఎన్నికలు జరగకూడదని వైఎస్సార్సీపీ భావిస్తోంది. సామాజికవర్గం, ఆయన తీరును తప్పుపడుతూ నిమ్మగడ్డతో జగన్ వ్యక్తిగతంగా కూడా కయ్యం పెట్టుకున్నారు. నిమ్మగడ్డ వాడిన కంప్యూటర్, హార్డ్ డిస్క్ ను స్వాధీనం చేసుకుని కేసు పెట్టారు. అప్పట్లో దీనిపై పెద్ద వివాదమే జరిగింది. ఈ తరుణంలో అత్యంత పెద్ద పదవిలో ఉన్న రమేశ్ కుమార్ స్థానిక సంస్థల ఎన్నికల్లో నిష్పక్షపాతంగా వ్యవహరిస్తారనే నమ్మకం ఏంటి.. అనే సందేహం వైఎస్సార్సీపీ నేతల్లో ఉంది. వైసీపీ అధికారంలో ఉంది కాబట్టి చాలాచోట్ల ఏకగ్రీవ ఎన్నికలు ఉంటాయి. వీటిపై అనేకచోట్ల ఫిర్యాదులు ఉంటాయి. వీటిపై నిమ్మగడ్డ ఏమైనా స్పందించి మూలాల్లోకి వెళ్తే అధికార పార్టీకి దెబ్బ పడుతుంది. అందుకే ఎన్నికల నిర్వహణపై వైసీపీ ఆలోచిస్తోంది. మరి దీనిపై కోర్టు ఏం తేల్చనుందో!