(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
జగన్ సర్కారుకు కోర్టు వ్యాజ్యాలు కలిసి వచ్చినట్లు లేదు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ఏర్పాటు విషయంలోనూ వ్యతిరేకంగా తీర్పు వచ్చింది.
జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టినప్పటి నుండి తీసుకున్న పలు నిర్ణయాలను సవాల్ చేస్తూ పలువురు హైకోర్టు గడప తొక్కిన విషయం తెలిసిందే. పలు విషయాలలో హైకోర్టు నుండి వ్యతిరేకంగా తీర్పులు వచ్చినా సుప్రీం కోర్టులో సవాల్ చేస్తూ ముందుకే వెళ్లిన సందర్భాలు ఉన్నాయి.
ప్రధానంగా పోలవరం ప్రాజెక్టు పనులు, పవర్ ప్రాజెక్టు పనులు, విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు (పిపిఏ), ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగులు వేసిన అంశం, రాజధాని తరలింపు తదితర నిర్ణయాలు హైకోర్టు గడప తొక్కిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంను తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీఓ 81, 85ను హైకోర్టు కొట్టివేసింది. ప్రభుత్వం జారీ చేసిన ఈ రెండు జీవోలను సవాల్ చేస్తూ ఏలూరుకు చెందిన డాక్టర్ గుంటుపల్లి శ్రీనివాస్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం తీర్పును వెలువరించింది. ప్రభుత్వ జీఓను సవాలు చేస్తూ న్యాయవాది ఇంద్రనీల్ సైతం పిల్ దాఖలు చేశారు. దీనిపై ఇటీవల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. నేడు ప్రభుత్వం జారీ చేసిన 81, 85 జీఓలను కొట్టేస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది.
అయితే ఇంగ్లీష్ మీడియం విషయంలో వెనక్కు తగ్గని జగన్ ప్రభుత్వం కోర్టు తీర్పు వెలువడక ముందే ఇటీవల మరో జీవో జారీ చేసింది. రాష్ట్రంలోని అన్ని ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం తప్పనిసరి చేస్తూనే ప్రతి మండలానికి ఒక తెలుగు మీడియం స్కూల్ కొనసాగించాలని తాజాగా ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. తెలుగు మీడియం చదవాలనుకునే పిల్లల కోసం మండలానికి ఒక తెలుగు మీడియం స్కూలును ఏర్పాటు చేయనుంది. ఉర్థు, ఒరియా, కన్నడ, తమిళ మీడియం స్కూళ్లను యథాతథంగా కొనసాగించనున్నారు. ప్రతి మీడియం స్కూల్లోనూ తెలుగును తప్పనిసరి చేయాలని ఆదేశాలిచ్చారు. స్కూళ్లకు వెళ్లే విద్యార్థులకు బస్సు ఛార్జీలు కూడా చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ నేపథ్యంలో పై రెండు జివోలను హైకోర్టు కొట్టి వేయడంపై జగన్ సర్కార్ ఏ విధంగా స్పందిస్తున్నన్నది ఆసక్తికరంగా మారింది. హైకోర్టు తీర్పును సుప్రీం కోర్టులో సవాల్ చేస్తుందా లేక నూతనంగా జారీ చేసిన జివో ఆధారంగా ముందుకు వెళుతుందా అనేది వేచి చూడాలి.