(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
ఒక వ్యాపారికి పరిపాలన తెలుసా…? ఒక అహంకారి పరిపాలన ఎలా ఉంటుంది? ఒక బిలీనియర్ పాలకుడుగా మారితే ఆపత్కాలంలో ఎలా ఎదుర్కోగలడు..? ఇవన్నీ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయిన కొత్తలో వచ్చిన మాటలు. ఇవీ ఇప్పుడు నిజమయ్యేలా స్ఫురిస్తున్నాయి. నాటి విపక్ష నేతల మాటలు నేడు అమెరికన్ల మదిలో మెదులుతున్నాయి. తిక్క, టెంపరి ట్రంపు ఇతర దేశాలను, ఇతర నాయకులను మాదిరిగానే ప్రాణాంతక కరోనాని కూడా తేలిగ్గా తీసుకుని… ఇప్పుడు భారీ మూల్యం చెల్లించుకుంటున్నారు. నిజానికి అమెరికా గనక ముందే తెరుకుంటే అక్కడున్న సౌకర్యాలు, సాంకేతికతకి అమెరికా ఎప్పుడో తెరుకునేది…, జపాన్ తరహాలోనే సేఫ్ జోన్ లోకి వెళ్ళేది, లేదా ఇండియా తరహాలో నెమ్మదిగా వ్యాప్తి ఉండేది. కానీ ట్రంపు ముందుచూపు లేనితనమే ఇప్పుడు ఆ దేశానికి ముప్పు తెచ్చింది.
అమెరికా లో జెట్ స్పీడ్ గా కరోనా
అగ్రరాజ్యం అమెరికా అంటే చాలా వరకు ప్రపంచంలో అన్ని దేశాలకు భయమే. అయితే ఆర్ధికంగా, సాంకేతికంగా అన్ని రంగాలలో మేటి దేశమైన అమెరికా నేడు కరోనా వైరస్ కు విలవిల లాడుతోంది. ఏ దేశంలో లేని విధంగా అమెరికాలో కొరోనా వైరస్ జెట్ స్పీడ్ తో వ్యాప్తి చెందుతోంది.
ఆరు లక్షలు దాటిన పాజిటివ్ కేసులు
అమెరికాలో నేటి వరకు 6,14,246 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు కాగా 26 వేల మందికి పైగా మృత్యువాత పడ్డారు. అమెరికా దేశంలోని 50 రాష్ట్రాలకు గాను 32 రాష్ట్రాలు పూర్తి లాక్ డన్ లో ఉన్నాయి. ఒక్క న్యూయార్క్ లోనే 2 లక్షలకు పైగా పాజిటివ్ కేసులు నమోదు కాగా 10 వేల మందికి పైగా మృతి చెందారు.
ట్రంప్ ఏకపక్ష నిర్ణయాలే కారణమా?
ట్రంప్ ఏకపక్ష నిర్ణయాల వల్లే అమెరికాలో కరోనా విజృంభిస్తోందని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆరోగ్య శాఖ, జాతీయ దర్యాప్తు సంస్థ, నిఘా వర్గాలు ప్రాణాంతక వైరస్ గురించి హెచ్చరించినా ట్రంప్ పట్టించుకోలేదని న్యూయార్క్ టైమ్స్ ఆరోపించింది. ఈ ఆరోపణలను ట్రంప్ ఖండిస్తున్నారు. చైనా ప్రయాణాలపై అందరికంటే ముందే నిషేధం విధించిన విషయాన్ని ఆయన గుర్తు చేస్తున్నారు. వైరస్ లక్షణాలు ఉన్న వారందరికీ పరీక్షలు చేయడంలో అధికార యంత్రాంగం విఫలం అయిందని, భౌతికదూరం పాటించే విషయంలోనూ శ్రద్ద చూపకపోవడం వల్ల న్యూయార్క్ లో వేగంగా వైరస్ విస్తరించిందని పలువురు పేర్కొంటున్నారు. కరోనా వైరస్ను పరీక్షించే కిట్లు తగినన్ని అమెరికాలో లేవని, ప్రజారోగ్య నిధులపై ట్రంప్ ప్రభుత్వం కోత విధించడం వల్లనే ఈ పరిస్థితి ఎదురైందని పలువురు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.
కరోనా బాధితులకు ఉద్దీపన ప్యాకేజీ
అమెరికా ఆర్థిక వ్యవస్థపై కరోనా ప్రభావం తీవ్రంగా పడింది. సంక్షోభం దిశగా పరుగులు పెడుతున్న ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ట్రంప్ సర్కార్ చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా 2 ట్రిలియన్ డాలర్ల ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించింది. ఈ ప్యాకేజీ వల్ల అమెరికాలోని వ్యాపారవేత్తలు, కార్మికులు, వైద్య సిబ్బంది ప్రతి ఒక్కరూ లబ్ధి పొందనున్నారు. ఇందులో 500 బిలియన్ డాలర్లను పరిశ్రమల కోసం కేటాయించనుంది. అమెరికాలోని ప్రతి ఒక్కరి ఖాతాలో సుమారు 1200 డాలర్లు (రూ.91 వేలు) జమ చేసేందుకు చర్యలు చేపట్టారు. అంతే కాకుండా చిన్నపిల్లలు ప్రతి ఒక్కరికి 500 డాలర్లు (సుమారు రూ.38వేలు) ఇవ్వనున్నారు. ఆధునిక అమెరికా చరిత్రలో ఇది అతి పెద్ద ఉద్దీపన ప్యాకేజీగా పలువురు నిపుణులు అభివర్ణిస్తున్నారు.