గుంటూరు: పధకం ప్రకారమే తనపై దాడి జరిగిందని శాసన సభాపతి కోడెల శివ ప్రసాద్ ఆరోపించారు. మగళవారం కోడెల గుంటూరు టిడిపి కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.
40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి దౌర్జన్యం చూడలేదని కోడెల అన్నారు. ఇనుమిట్లలో బూత్ ఆక్రమణ జరిగిందని తెలిసి అక్కడికి వెళ్లానని కోడెల చెప్పారు. వైసిపి నేతల తీరు మొగుణ్ణి కొట్టి మొగసాలకు ఎక్కినట్లుంద్దని కోడెల అన్నారు. దాడి చేసిన వారే తిరిగి ఫిర్యాదు చేస్తారా అని కోడెల ప్రశ్నించారు.
మొన్నటి దాడిలో కావాలనే వెనక్కి తగ్గమని కోడెల అన్నారు. ఘర్షణ పడవద్దని టిడిపి కార్యకర్తలకు చెప్పానన్నారు. స్పీకర్ పై దాడి జరిగితే సుమోటోగా కేసు చేపడతారని కోడెల తెలిపారు.
కొందరు నేతలు మరో గతి లేక జగన్ పక్కన ఉన్నారని కోడెల అన్నారు. ఎవరు ఫిర్యాదు చేసినా పోలీసులు కేసు నమోదు చేస్తారన్న కోడెల విచారణలో నిజా నిజాలు వెల్లడవుతాయన్నారు. దుర్మార్గులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని కోడెల పేర్కొన్నారు. ఇనుమెట్లలో ఏం జరిగిందో వీడియో దృశ్యాలు బయటపెట్టాలని కోడెల డిమాండ్ చేశారు.
టిడిపికి వైసిపి పోటీ కాదు.. కోడెలకి అంబటి పోటీ కాదు..అని కోడెల అన్నారు. వైసిపి నేతలు అసెంబ్లీ నుంచి పారిపోయారని కోడెల విమర్శించారు. అసెంబ్లీకి రానివాళ్లు జీతాలు ఎలా తీసుకుంటారని కోడెల ప్రశ్నించారు. జగన్ జన్మలో ముఖ్యమంత్రి కాలేడని కోడెల ఘాటుగా విమర్శించారు. ప్రవర్తన మార్చుకోక పోతే రాజకీయ నాయకుడిగానూ పనికిరాడని కోడెల పేర్కొన్నారు.
జగన్ ఎప్పుడూ హైదరాబాద్ లోనే ఉంటారు, కేసీఆర్ తో కలిసి పని చేస్తానంటారు. ఇలాంటి వ్యక్తిని ఆంధ్ర ప్రజలు ఎప్పటికీ ఒప్పుకోరని కోడెల అన్నారు. ఆంధ్ర ప్రజలు చైతన్యం, విజ్ఞత కలిగిన వాళ్ళనీ, వాళ్ళకి ఏం కావాలో స్పష్టంగా తెలుసనీ కోడెల చెప్పుకొచ్చారు.
మొన్నటి ఎన్నికల్లో ఓటర్లు ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడారని కోడెల అన్నారు. మహిళలు, పింఛన్ల లబ్ధిదారులు టిడిపి వెంటే ఉన్నారని కోడెల పేర్కొన్నారు. సభాపతిగా నిస్పక్షపాతంగా పని చేసానని కోడెల అన్నారు.