జనసేనతో బీజేపీ ఎందుకు దోస్తీ కట్టింది..?
సోము వీర్రాజుకి ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఎందుకు నియమించింది..??
సోము వీర్రాజు వెంటవెంటనే చిరంజీవిని, ముద్రగడని ఎందుకు కలిశారు..??
వంగవీటి టీడీపీలో ఎందుకు సైలెంట్ అయ్యారు..?
గంటా శ్రీనివాసరావు వైసీపిలోకి అనుకుని మళ్ళీ ఎందుకు ఆగిపోయారు..?
రెడ్డిలకు జగన్, వైసీపి ఉన్నారు. కమ్మలకు టీడీపీ, చంద్రబాబు ఉన్నారు. మరి కాపులకు ఎవరున్నారు..?? జనసేన ఉంది అనుకున్నా ఆ రెండు పార్టీల ముందు బలం చాలదు అందుకే బీజేపీ. అదే బీజేపీ “కాపు”రం. ఇది సింపుల్ సాదా సీదా కాదు, పక్కా స్కెచ్ తో, “యాక్షన్ ప్లాన్ – 2024 ” రెడీ చేశారు. ఏపీలో కీలక నేతలకు “కాషాయం” ఆహ్వానం పలుకుతుంది. వారెవరో, ఆ ప్లాన్ ఏమిటో చూడాల్సిందే.
2024 లక్ష్యంగా బీజేపీ ఏపీలో పావులు కదుపుతుంది అనే విషయం అందరికీ తెలిసిందే. ఆ పావులు ఏమిటి..? ఆ ప్రణాళిక ఏమిటి..? ఆ వ్యూహంలో దశలు ఏమిటి..? అనేది తెలుసుకోవడమే ఇప్పుడు కీలక అంశం. టీడీపీని బలహీనం చేసి ఆ స్థానం ఆక్రమించాలని అనుకుంటుంది నిజమే…, కానీ ఒక సామాజికవర్గం గొడుగు పట్టుకోవాలి కదా…!! రెడ్డిల హవా ఉన్న వైసీపి.., కమ్మల హవా ఉన్న టీడీపీ ఎంతగా సామాజికన్యాయం, ఎంతగా సమ ప్రాధాన్యత అంటున్నా పదవులు, హోదాల్లో వారికే ఇచ్చేస్తున్నారు. అందుకే ఏళ్ళ తరబడి కాపులు సరైన గొడుగు కోరుకుంటున్నారు. చిరంజీవి వచ్చినా కనుమరుగయ్యారు, పవన్ కళ్యాణ్ వచ్చినా తెరమరుగయ్యారు. ఆ వైసీపి,టీడీపీ ల ముందు ఈ బలం చాలలేదు. అందుకే ఇప్పుడు బీజేపీ రూపంలో ఆ బలం పోగయింది. ఈ బలంతో, బలగం చేరి ఇతర వర్గాలకు కలుపుకుని ఓట్లు, సీట్లు సాధించడమే ఈ ప్లాన్. ఇది కూడా మూడు, నాలుగు దశల్లో అమలుకు సన్నాహాలు చేస్తున్నారు.
కీలక నేతలను చేర్చుకుని…!
రాష్ట్రంలో కాపు నేతలు అంటే ముందుగా గుర్తుకు వచ్చేది ముద్రగడ పద్మనాభం.., వంగవీటి తదితరులు. వందల్లో నాయకులు ఉన్నప్పటికీ… ఆ సామజిక వర్గ ఓట్లు ప్రభావితం చేయగలిగే నాయకులు మాత్రం వీళ్ళే. మొదటి దశలో వీరిని పార్టీలో చేర్చుకోవడం లక్ష్యం. ఇప్పటికే ప్రాధమిక దశలో ముద్రగడతో చర్చలు ముగిసాయి. ఆయన పరోక్ష మద్దతు తెలిపినప్పటికీ.., కండువా కప్పుకుని అవకాశం లేదన్నారట…! ఇక మరో నేత వంగవీటితో ప్రస్తుతం సంప్రదింపులు జరుగున్నాయి. ఆయన కొద్దీ రోజుల్లోనే నిర్ణయం వెల్లడించే అవకాశం ఉంది అంటున్నారు.
జిల్లాల వారీగా జాబితా… ఆపై సంప్రదింపులు…!!
మొదటి దశలో బీజేపీలోకి కాపు కీలక నేతలు చేరిన తర్వాత… ఇక రెండో దశలో జిల్లాల వారీగా ప్రణాళిక అమలవుతుంది. ముద్రగడ, వంగవీటి తర్వాత ఉత్తరాంధ్రలో ప్రభావితం చేయగల గంటా శ్రీనివాసరావుపై దృష్టి మళ్లింది. ఆయనని బీజేపీ నేతలు పలువురు సంప్రదించడంతో వైసీపిలో చేరాల్సిన తరుణంలో వెనక్కు తగ్గినట్టు చెప్తున్నారు. ఇక తూర్పు గోదావరి జిల్లాలో రాజమండ్రి, కాకినాడ, అమలాపురం మూడు ప్రాంతాల్లోనూ ముగ్గురు గట్టి నాయకులను సంప్రదించే యోచనలో ఉన్నారట. మొదటి దశలో టీడీపీ మాజీలు, రెండో దశలో వైసీపి అసంతృప్తి వాదులు… మూడో దశలో వైసీపి కీలక నేతలు… ఇలా అందరిని టచ్ చేస్తారు. ఇలా జిల్లాల వారీగా సిద్ధం చేసుకున్న జాబితా ఆధారంగా బీజేపీ – కాపు ఉమ్మడి ప్రణాళిక అమలు చేసే దిశగా ప్రస్తుతం ప్రాధమిక అవగాహన కుదిరినట్టు తెలుస్తుంది.
ఇతర వర్గాలు దూరం కాకుండా…!
రాజకీయం చాలా సున్నితమైనది. అందులోనూ సామజిక వర్గ అంశాలంటే మరీ సున్నితం. నిజాలు తెలిసినా మాట్లాడకూడదు. “జగన్ అంటే.., వైసీపి అంటే రెడ్డి సామజిక వర్గం అని తెలుసు… కానీ బయటకు అలా అనుకోకూడదు… “సామజిక న్యాయం, సమ న్యాయం” అంటూ బాకా ఊదాలి. అలాగే టీడీపీ అంటే.., చంద్రబాబు అంటే కమ్మ అని తెలుసు. కానీ ఈ విషయం కూడా బయటకు చెప్పకూడదు. “ఇది బిసిల పార్టీ” అని బాకా ఊదాలి. అలాగే బీజేపీ అంటే కాపులకు ప్రాధాన్యత ఇస్తారు, అదే ప్రణాళికతో వెళ్తున్నారు అనకూడదు. తేరా పైన జరిగేది జరుగుతుంది.., తెరవెనుక జరగాల్సింది జరుగుతుంది. మొత్తం ఒకేసారి కాదు, దశల వారీగా.., ప్రణాళికాబద్ధంగా…!!