ఇద్దరిదీ ఒకటే మాట
ప్రపంచాన్నే కరోనా కలవరపెడుతోంది. కానీ ఏపీని కరోనాతోపాటు, వరదలు కూడా కల్లోలానికి గురిచేస్తున్నాయ్. అదే సమయంలో రాజకీయం సైతం రంజుగా మారిపోతోంది. సందర్భం ఏదైనా సరే అధికార పార్టీపై విమర్శల జడి కురిపించే ప్రతిపక్షం తాజాగా మరో బలమైన ఆరోపణ చేస్తోంది. ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్ ఇప్పుడు అరెస్టులు-కరోనా విలయంపై సర్కారును తీవ్రంగా విమర్శిస్తున్నారు. ప్రభుత్వం కావాలనే టీడీపీ నాయకులను అరెస్టు చేస్తోందని… పైపెచ్చు కరోనా ప్రమాదం పొంచి ఉందని ఇందుకీలా చేస్తున్నారో అర్థం కావడం లేదంటూ సీఎం జగన్మోహన్ రెడ్డిపై డబుల్ ధమాకా మోగించారు తండ్రి, తనయులు.
కరోనా ప్రమాదం తెలిసి కూడా… ?
దేశంలో ఎక్కడా పతనమవనంత దారుణంగా పడిపోయింది ఒక ప్రతిపక్షంగా టీడీపీ. కానీ వాయిస్ రెయిజ్ చేయడంలో మాత్రం ఆ పార్టీ మేటి. ప్రతిపక్షం వాయిస్ బలంగా విన్పిస్తుంది. సందర్భం ఏదైనా కానివ్వండి… అందుకు సీఎం జగన్మోహన్ రెడ్డే కారణమంటూ… ఆ ఇద్దరూ మండిపడుతున్నారు. సోషల్ మీడియా వేదిగా ఇవాళ తండ్రి, తనయులు సీఎం జగన్మోహన్ రెడ్డి, ప్రభుత్వ యంత్రాంగంపై నిప్పులు చెరిగారు. జేసీ ప్రభాకర్ రెడ్డి అరెస్టుపై ప్రతిపక్ష నేత చంద్రబాబు తీవ్రంగా స్పందించారు చంద్రబాబు. జైలు నుంచి విడుదలైన 24 గంటల్లోనే అరెస్టు చేయడం దారుణమని… దోపిడి దొంగలకు, ప్రజల నుంచి వచ్చిన నాయకులకు తేడా తెలియదా అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రభాకర్ రెడ్డి, అచ్నెన్నాయుడు కరోనా బారిన పడటానికి కారణం ఎవరని నిలదీశారు. కరోనా ముప్పు తెలిసి ప్రజా నాయకుల పట్ల దారుణంగా వ్యవహరిస్తారా అంటూ ప్రశ్నించారు. మొత్తంగా ప్రభుత్వం తీరు దారుణమని… కష్ట సమయంలో… టీడీపీ నాయకులను మరింత కష్టపెడుతున్నారంటూ ఆక్రోశం వెల్లగక్కారు చంద్రబాబు.
ఒక్క ఛాన్స్ అంటూ లోకేశ్ విమర్శలు
జగన్ ఒక్క ఛాన్స్ అడిగింది ప్రజల కోసం కాదని… కేవలం కక్ష సాధింపు కోసమేనంటూ సోషల్ మీడియా ద్వారా విమర్శలు గుప్పించారు లోకేశ్. కరోనా, వరదల ముప్పుతో జనం ఇబ్బందులెదుర్కొంటుంటే… ప్రతిపక్ష నేతలను అక్రమ అరెస్టులతో వేధిస్తున్నారంటూ మండిపడ్డారు. కేవలం వ్యక్తిగత కక్షతో జేసీ కుటుంబంపై అక్రమ కేసులు పెట్టి రాక్షస ఆనందం పొందుతున్నారంటూ సోషల్ మీడియాలో రాసుకొచ్చారు. జేసీ ప్రభాకర్ రెడ్డిని అరెస్ట్ చేసిన 24 గంటల్లోతిరిగి అరెస్ట్ చేసి… కరోనా బారిన పడటానికి కారణం సీఎం జగన్ నేరమనస్తత్వమేనంటూ ఆరోపించారు.
ఒకే అంశంపై తండ్రి, కొడుకుల నిప్పులు
పార్టీలో ఒక్కొక్కరు ఒక్కో అంశంపై మాట్లాడటం కామన్ గా జరుగుతుంది. కానీ జేసీ ప్రభాకర్ రెడ్డి విషయంలో పార్టీ అగ్రనేతలిద్దరూ కూడా మాట్లాడటం… సోషల్ మీడియా వేదికగా వాయిస్ రెయిజ్ చేయడం ఇదే మొదటిసారి అంటున్నారు పార్టీ నేతలు. జేసీ కుటుంబానికి అండగా నిలిచేందుకు ఇప్పటికే టీడీపీ లీగల్ టీం శక్తివంచన లేకుండా పనిచేస్తోంది. చాలా కేసుల్లో జేసీ ప్రభాకర్ రెడ్డికి బెయిల్ వచ్చినా మరో కేసులు అరెస్టు చేయడంతో పార్టీ నేతల్లో వణుకు మొదలయ్యింది. ఇప్పటికే అచ్చెన్నాయుడు ఈఎస్ఐ స్కామ్ లో అరెస్టై… ప్రస్తుతం కరోనా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు.