శ్రావణమాసఅమావాస్యను.. పోలాల అమావాస్యఅంటారు. అమావాస్యను పండుగలా జరుపుకోవడం దక్షిణ రాష్ట్రాలలో అనాదిగా ఉంది. శ్రావణ మాసం అమావాస్య ను పోలేరమ్మ పండగగా కూడా జరుపుకొంటారు.
పూర్వం నుంచి మనకు ఎన్నో పర్వదినాలు, పండుగలు ఉండేవి. అవన్నీ మన సంస్కృతికి, సంప్రదాయాలకి అద్దం పట్టేవిగా ఉండేవి. అప్పట్లో ఊరు ఊరంతా కలిసి చేసుకునేవారు. ఇప్పుడు మ్యుఖ్యమైన పండగలకి కూడా కుటుంబం లోని సభ్యులు కలవడమే గగనం అయిపోతోంది. మన పిల్లలకి మన పండగలలో చాలా పండగల విశిష్టత మాట పక్కకు పెడితే, పేర్లు కూడా తెలియదు అంటే అతిశయోక్తి కాదు. అలా మన పిల్లలతో పాటు మనలో చాలా మంది విస్మరిస్తున్న పండగలలో ఒక పండగ ప్రతి శ్రావణ మాసంలో అమావాస్య రోజు చేసుకునే ఎంతో ముఖ్యమైన పండుగ. పోలాల అమావాస్య’ పండుగ. దీనినే ‘పోలాంబ వ్రతం’ లేక ‘కంద గౌరీ వ్రతం’ అని కూడా అంటారు. ఈ వ్రతం తల్లి అయిన ప్రతి స్త్రీ తప్పక చేయాలి.
వ్రత విశేషాలు ఇవే.
ఈ వ్రతం చేయడం వల్ల సంతానం ఆయురారోగ్యాలతో లభిస్తాయి. మనం మన సంతానం ఆయురారోగ్యాలతో ఉండటానికి కారణం మన గ్రామ దేవతల కరుణా
కటాక్షాలే. అందుకే మన పెద్దలు గ్రామ దేవతలను ప్రసన్నం చేసుకోవడానికి పండుగల రూపాలలో ఎన్నో అవకాశాలు కల్పించారు. మరి అటువంటి గ్రామదేవతలలో పోలేరమ్మ ఒక ముఖ్యమైన దేవత. అమ్మవారుగా కొలవబడే పోలేరమ్మ వారిని పూజించుకుందాం.
పొలాల అమావాస్య రోజు ఒక కంద మొక్క కాని కంద పిలక కాని తెచ్చుకోండి. పసుపు, కుంకుమ, పూలు, కొబ్బరి కాయ ఒకటి, పసుపు కొమ్ములు రెండు, అరడజను అరటి పళ్ళు.పొలాల అమావాస్య రోజున స్త్రీలు ఉదయాన్నే లేచి తలారా స్నానం చేసి కంద మొక్క ని కాని కంద పిలకను కాని పూజా మందిరంలో పెట్టుకుని పసుపు కుంకుమ బొట్లు పెట్టాలి. పసుపు
వినాయకుని, పసుపు గౌరమ్మని, చేసుకుని తమల పాకుల్లో కంద మొక్క దగ్గరగా పెట్టుకోవాలి.
నైవేద్యానికి పళ్ళు, కొబ్బరి కాయతో పాటు అమ్మ వారికీ వడ పప్పు, పానకం, చలిమిడి, ఆడ సంతానం కలవారు గారెలు, మగ సంతానం కల వారు బూరెలు సిద్దం చేసుకోవాలి. ఇద్దరు వున్నవారు రెండూ సిద్దం చేసుకోవాలి. రెండు దారం పోగులకు పసుపు రాసి పసుపు కొమ్ములు కట్టి ఉంచుకోవాలి. ఈ వ్రత కథ ప్రతి స్త్రీల వ్రత కథల పుస్తకంలో కనిపిస్తుంది. ఆ పుస్తకం కూడా దగ్గర పెట్టుకోండి. ఇక పూజా విధానం ఇతర పూజల లాగానే. ముందుగా ఆచమనం చేసుకుని, సంకల్పం చెప్పుకుని గణపతి పూజ చేసుకుని అమ్మ వారికి షోడశోపచార పూజ చేసుకోవాలి.
పసుపు అమ్మ వారిని, కంద మొక్క లేక కంద పిలకని, కుంకుమతో పుష్పాలతో పూజించి, దీప, ధూప, నైవేద్యాలు సమర్పించి, అక్షతలు చేత పట్టుకుని, వ్రత కథ చదువుకుని, కొన్ని అక్షతలు అమ్మ వారి మీద, కొన్ని కుటుంబ సభ్యుల అందరి మీద జల్లు కోవాలి. పసుపు కొమ్ము కట్టిన ఒక దారం అమ్మ వారి దగ్గర ఉంచి, ఇంకో దారం పూజ చేసిన స్త్రీ మెడలో కట్టు కోవాలి. తీర్థ ప్రసాదాలు భక్తి తో స్వీకరించాలి.