కాపుల ఆరాధ్య నేత వంగవీటి రంగ కుమారుడు వంగవీటి రాధా నేటి మీడియా సమావేశం నేపథ్యంలో ఎపిలో రాజకీయంగా కాపుల మద్దతు అనే అంశం మరోసారి తెరమీదకు వచ్చింది. రాజకీయంగా గతంలో ఎన్నడూ లేని విధంగా కాపులకు ఎనలేని ప్రాధాన్యత ఏర్పడిన ఈ తరుణంలో వంగవీటి రాధాకృష్ణ వ్యవహారాన్ని తేలిగ్గా తీసుకోవటానికి వీలులేదనేది నిర్వివాదాంశం. నేటి ప్రెస్ మీట్ లో వంగవీటి రాధా మాట్లాడిన మాటల్లో రెండు అంశాలు అత్యంత ప్రాధాన్యత కలిగినవిగా చెప్పుకోవచ్చు. అవి జగన్ తనను, కాపు నేతలను అవమానించడంపై రాధా ఆవేదన, రెండు వంగవీటి రంగా హత్యను టిడిపికి ఆపాదించడం సరికాదంటూ వివరణ.
ఆ విషయాన్ని కాసేపు పక్కన బెడితే తాజా ప్రెస్ మీట్ లో వంగవీటి రాధా వ్యాఖ్యలను బట్టి ఆయన టిడిపిలోకి వెళ్లడం ఖాయమని తేలిపోయింది. అయితే వంగవీటి రాధా ఉదంతం తో ఇప్పుడు ఏపి రాజకీయాల్లో ఒక అంశం తీవ్ర చర్చకు దారితీస్తోంది. అది వచ్చే ఎన్నికల్లో రాజకీయంగా కాపుల మద్దతు ఏ పార్టీకి ఉండొచ్చు అనేది. అంతేకాదు అసలు జగన్ కు కాపుల మద్దతు ఉంటుందా?…అని కూడా చర్చలు జరుగుతున్నాయి. ఇక పవన్ టిడిపితో కలసి కాకుండా వేరుగా పోటీ చేస్తే కాపుల ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో వారి మద్దతు ఆయనకే ఉంటుందనేది ఒక అంచనా. ఏదేమైనా ఆంధ్రప్రదేశ్ లో అధికారం హస్తగతం చేసుకోవాలంటే అత్యంత కీలకమైన కాపుల పట్ల ఎపి రాజకీయ పార్టీలు, వాటి అధినేతలు వ్యవహరిస్తున్న తీరు ఒక్కసారి అవలోకనం చేసుకోవటం ఎంతైనా అవసరం.
కారణాలు ఏమైనప్పటికి ప్రస్తుత పరిస్థితుల్లో కాపు నేతలను అధికార పార్టీ టిడిపి అధినేత చంద్రబాబు రెడ్ కార్పెట్ పరిచి మరీ స్వాగతం పలుకుతుంటే…ప్రతిపక్ష నేత జగన్ మాత్రం కాపు నేతలను వెంటబడి మరీ తమ పార్టీలో నుంచి బైటకు తరుముతున్నట్లుగా పరిస్థితులు కనిపిస్తున్నాయి. వంగవీటి రాధాకృష్ణ వ్యవహారంతో సహా ఇటీవలి కాలంలో వైసిపిలోని పలువురు ముఖ్య కాపు నేతల పట్ల జగన్ వ్యవహరిస్తున్న తీరు ఆ సామాజికవర్గంలో తీవ్ర ఆగ్రహావేశాలు రగిలిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కాపుల్లో అత్యంత ఆదరాభిమానాలు కలిగిన దివంగత నాయకుడు వంగవీటి రంగా కుమారుడైన వంగవీటి రాధాకృష్ణ విషయంలోనూ జగన్ వ్యవహరించిన తీరు రాజకీయ అపరికత్వతనే సూచిస్తోందని మేధావులు విశ్లేషిస్తున్నారు. అధికారం చేపట్టాలనే బలీయమైన ఆకాంక్ష కలిగిన ఏ నాయకుడు కుల సమీకరణలే అత్యంత ప్రధానంగా మారిన రాజకీయ వ్యవస్థలో ఒక మెజారిటీ సామాజిక వర్గం మనోభావాలు దెబ్బతినేలా పదే పదే ప్రవర్తించే సాహసం చేయడనేది వారు అభిప్రాయపడుతున్నారు.
కాపుల రిజర్వేషన్ అంశంపై వ్యాఖ్యలు, పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత విమర్శలు జగన్ పట్ల కాపుల్లో వ్యతిరేకతకు నాంది పలుకగా తదనంతరం తూర్పు,పశ్చిమ గోదావరి జిల్లాల్లో పలువురు వైసిపి కీలక కాపు నేతలు టిడిపిలో చేరిపోవటం చర్చనీయాంశంగా మారింది. అది అంతటితో ఆగకుండా మిగతా జిల్లాల్లోనూ బలీయమైన అభ్యర్థులకే అవకాశం పేరిట పలు నియోజకవర్గాలకు ఇన్ ఛార్జ్ లుగా ఉన్న కాపునేతలను పక్కకు తప్పించడం వారిలో జగన్ పట్ల అసంతృప్తిని మరింత పెంచింది. ఈ విధంగా గుంటూరు జిల్లా పెదకూరపాడులో తనకే టికెట్ వస్తుందన్న నమ్మకంతో ఎప్పటినుంచో పార్టీ కార్యక్రమాలు నిర్వహించుకుంటూ వస్తున్న కాపు నేత కావటి మనోహర్ నాయుడును ఉన్నట్లుండి తప్పించడం, అలాగే సత్తెనపల్లిలోనూ అంబటి రాంబాబు ధీటైన అభ్యర్థి కాదని సర్వేలో తేలిందని,ఆయనకి కూడా అక్కడ నుంచి ఉద్వాసన తప్పదనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో జగన్ కావాలనే కాపులను దూరం చేసుకుంటున్నారనే అని ఆలోచించే పరిస్థితి కూడా కనిపిస్తోంది.
మరోవైపు టిడిపి అధినేత చంద్రబాబు తీరు చూస్తే కాపుల ఆదరాభిమానాల కోసం ఎంతో ఆసక్తి కనబరుస్తున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. గత ఎన్నికల్లో కీలకమైన చివరి ఘట్టంలో పవన్ కళ్యాణ్ టిడిపికి మద్దతు ప్రకటించేలా చేయడం, ఆ ఎన్నికల్లో విజయం సాధించి అధికారం చేపట్టడం, అందుకు కాపుల మద్దతే కారణమని బహిరంగంగా అంగీకరించడం అందరికీ తెలిసిందే. అయితే తదనంతర కాలంలో ఎన్నికల హామీ అయిన కాపుల రిజర్వేషన్ విషయంలో తీవ్ర జాప్యం, ఆ క్రమంలో ముఖ్య కాపు నేత ముద్రగడ పద్మనాభం ఉద్యమం, ఆ ఉద్యమంతో పాటు ముద్రగడ పట్ల, ఆయన కుటుంబం పట్ల టిడిపి ప్రభుత్వం వ్యవహరించిన తీరు కాపుల్లో చంద్రబాబు పట్ల అయిష్టత పెరిగేందుకు కారణమయ్యాయి.
కాపుల రిజర్వేషన్ చేసినా అది మనస్ఫూర్తిగా చేసింది కాదని కేంద్రంపై నెపం వేయడానికే అని కాపుల్లో అత్యధికులు నమ్మినట్లు కనిపించింది. తదనంతరం పవన్ కళ్యాణ్ టిడిపిపై తీవ్ర విమర్శ నేపథ్యంలో కాపుల్లో మెజారిటీ పార్టీకి దూరమైన పరిస్థితులు కనిపించాయి. దీంతో అలర్ట్ అయిన చంద్రబాబు ఎలాగైనా కాపుల ఆదరాభిమానాలను తిరిగి పొందాలని ఇతర పార్టీలోని ముఖ్య కాపు నేతలను టిడిపిలోకి ఆహ్వానిస్తుండటం, వారు కోరిన విధంగా తగిన ప్రాధాన్యత కల్పించడం కోసం ఇతర నేతలకు సర్థిచెప్పడం వంటివి చేస్తూ కాపుల ఆదరణ పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. అంతేకాదు కేంద్రం ఈబీసీలకు కల్పించిన 10 శాతం రిజర్వేషన్ లోనూ 5 శాతం కాపులకు కల్పిస్తానని చెప్పడం ద్వారా వారి అభిమానాన్ని చూరగొనేందుకు యత్నిస్తున్నారు. ఇలాంటి కీలక తరుణంలో వంగవీటి రంగా కుమారుడు వంగవీటి రాధాని టిడిపిలోకి తెచ్చేందుకు చంద్రబాబు చూపుతున్న చొరవ…వంగవీటి రంగా హత్యకు టిడిపినే కారణమనే ఆగ్రహంతో సుదీర్ఘకాలంగా ఆ పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్న కొందరు కాపుల్లోనైనా పాత ధోరణి గురించి పునరాలోచించేలా చేస్తుందనడంలో సందేహం అక్కర్లేదు.
ఈ మొత్తం పరిణామాలను బట్టి చూస్తే ఎపిలో బలమైన సామాజికవర్గంగా ఉన్న కాపులను మళ్లీ తమ దారిలోకి తెచ్చుకొని రాజకీయంగా లబ్ది పొందేందుకు చంద్రబాబు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంటే…జగన్ మాత్రం కాపులు తన పట్ల వ్యతిరేకత పెంచుకునేలా వ్యాఖ్యలు చేయడం, ఆ విధమైన నిర్ణయాలు తీసుకోవడమే కాకుండా తన తీరుతో ఎంతో కాలంగా అండగా ఉన్న కాపు నేతలను సైతం కోల్పోతుండటం వైసిపి శ్రేణులనే కాదు రాజకీయ పరిశీలకులని సైతం విస్మయానికి గురిచేస్తోంది.