సుప్రీంకోర్టు న్యాయమూర్తిపై పలు సంచలన అంశాలను ప్రస్తావిస్తూ, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దేశ సర్వోన్నత న్యాయస్థానాకి చెందిన ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాసిన సంగతి తెలిసిందే.
ఈ అంశంపై వివిధ రాజకీయ పార్టీల నేతలు, న్యాయ నిపుణులు, రాజ్యాంగ కోవిదులు తమ తమ విశ్లేషణ చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్పందనపై అందరి దృష్టి పడింది. ఇలాంటి తరుణంలో తాజాగా ఆయన స్పందించారు.
కట్టు బానిసల కంటే హీనం
గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ నేతలతో జరిగిన సమన్వయ సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. రాజధానిని మూడు ముక్కలాటగా మార్చారని మండిపడ్డ చంద్రబాబు అమరావతి ప్రాంత వైసీపీ ఎమ్మెల్యేలు కట్టుబానిసలు కంటే హీనం అని చంద్రబాబు దుయ్యబట్టారు. “రాజధానిని తరలించాలని వైసీపీ కుట్ర పన్నింది. ప్రజలందరూ అమరావతి కోసం ఉద్యమిస్తున్నారు. రైతులు ఇచ్చిన భూముల విలువ లెక్కగడితే.. రాష్ట్రం అభివృద్ధి చెంది ఉండేది. అమరావతిని, అభివృద్ధిని జగన్ చంపేస్తున్నారు. డబ్బుల కోసం కక్కుర్తిపడి వైసీపీ ఎమ్మెల్యేలు రాజధాని ప్రజలకు ద్రోహం చేస్తున్నారు. ఈ నెల 22 తేదీ నాటికి ప్రధాని శంకుస్థాపన చేసి ఐదేళ్లు అవుతుంది. టీడీపీ ప్రభుత్వం వచ్చి ఉంటే అమరావతి ప్రాంతం మరింతగా అభివృద్ధి చెందేది. నేడు కళావిహీనంగా మారింది. “ అంటూ వ్యాఖ్యానించారు.
చీ చొడుతున్నా సిగ్గు రావట్లేదు
ఏపీ సీఎం వైఎస్ జగన్ న్యాయవ్యవస్థ పైనే దాడికి తెగబడ్డారని చంద్రబాబు ఆరోపించారు. `రాజ్యాంగాన్ని, చట్టాలను అమలు చేస్తున్నందుకు, వాటిని సమీక్షిస్తున్నందుకు న్యాయ వ్యవస్థపైనే బురదజల్లే కార్యక్రమం మొదలు పెట్టారు. ఈ దేశ అత్యున్నత న్యాయస్థానానికి ప్రధాన న్యాయమూర్తి అయ్యే అవకాశం ఒక తెలుగువాడికి వస్తుంటే జగన్ ఓర్వ లేక పోతున్నాడు. నిష్పాక్షికంగా న్యాయాన్ని అమలు చేస్తున్న న్యాయవాదులపై తమ వారితో దాడులు చేయిస్తున్నాడు. వైసిపి నాయకులు న్యాయవ్యవస్థపై చేస్తున్న కామెంట్లకు దేశం మొత్తం చీకొడుతున్నా సిగ్గు రావడం లేదు“ అంటూ చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.
జగన్కు 30 ఏళ్ల జైలు
ఏపీ సీఎం జగన్కు ముప్పై సంవత్సరాల జైలు శిక్ష పడే అవకాశం ఉందని పలు సంస్థలు పేర్కొన్నట్లు చంద్రబాబు తెలిపారు. “ ఢిల్లీ సంస్థ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్’ (ఏడీఆర్) ఇటీవల విడుదల చేసిన నివేదిక జగన్ మోహన్ రెడ్డికి పది సంవత్సరాల నుండి 30 సంవత్సరాల వరకూ జైలు శిక్ష పడే అవకాశం ఉందని పేర్కొంది. అంతటి అవినీతిపరుడు ఇప్పుడు ముఖ్యమంత్రి అయి న్యాయవ్యవస్థపై బురద చల్లాలని ప్రయత్నిస్తున్నారు. జగన్ కంటే ముందు అనేక మంది ముఖ్యమంత్రి పదవిని అలంకరించారు. వారందరూ తెలుగువారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టాలని ప్రయత్నించారు. కానీ జగన్ మాత్రం తెలుగువారికి చెడ్డపేరు తెచ్చేలా, తెలుగు వారిని చూసి నవ్వుకునేలా రాష్ట్రం పరువు తీస్తున్నారు. తెలుగువాడు పీవీ నరసింహారావు దేశ ప్రధాని అయ్యే అవకాశం వచ్చినప్పుడు పోటీపెట్టకుండా టీడీపీ గౌరవించింది. స్వచ్ఛందంగా ఎన్నికల నుంచి తప్పుకుంది. నేడు ఒక తెలుగువాడు దేశ అత్యున్నత న్యాయస్థానానికి ప్రధాన న్యాయమూర్తి అవుతుంటే జగన్ ఓర్వలేక పోతున్నాడు.“ అంటూ దుయ్యబట్టారు.