దెందులూరు: జనసేన పార్టీని టిడిపిలో విలీనం చేస్తే తాను రాజకీయ సన్యాసం స్వీకరిస్తానని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వ్యాఖ్యానించారు. చింతమనేని ప్రభాకర్ వంటి వారు ఉండడం వల్లే తాను తెలుగుదేశం పార్టీతో పొత్తుపెట్టుకోవడం లేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలకు ఆయన ఈ మేరకు జవాబిచ్చారు.
అంతేకాకుండా తన స్థానం నుంచి పవన్ కళ్యాణ్ పోటీచేస్తే ఆయనను గెలిపించి అసెంబ్లీకి పంపే బాధ్యత కూడా తాను తీసుకుంటానని చింతమనేని పేర్కొన్నారు.
పవన్ తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని చింతమనేని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవేళ పవన్ ఎన్నికల్లో గెలిచి అసెంబ్లీకి వస్తే తానేంటో తెలుస్తుందని చింతమనేని స్పష్టం చేశారు.
ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలిచే చింతమనేని ప్రభాకర్పై తొలి నుంచి పవన్ కళ్యాణ్ తీవ్ర విమర్శలు చేస్తూనే ఉన్నారు. గతంలో దెందులూరులో నిర్వహించిన రోడ్డుషోలో మాట్లాడుతూ ‘చింతమనేని అక్రమాలు, అన్యాయాలు, దుర్మార్గాలు చంద్రబాబుకు కనిపించడం లేదా?’ అని ప్రశ్నించిన విషయం తెలిసిందే.