ఢిల్లీ: ఎఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీని ఆమేఠీ ప్రజలు తిరస్కరించారు, అందుకే మరో సురక్షిత స్థానం నుండి పోటీ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారంటూ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ పేర్కొన్నారు. రాహుల్ గాంధీ ఈ సారి లోక్సభ ఎన్నికల్లో అమేఠీతో పాటు దక్షిణాది రాష్ట్రాల్లోని ఏదో ఒక స్థానం నుండి పోటీ చేస్తారని వార్తలు వస్తున్న నేపథ్యంలో రాహుల్పై స్మృతి ఇరానీ విమర్శలు చేశారు. కేరళలోని వయునాయుడు నియోజకవర్గం నుండి రాహుల్ పోటీ చేస్తారని ఆ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు ముళ్లపల్లి రామచంద్రన్ శనివారం తెలిపారు. అయితే దీనిపై పార్టీ వర్గాల నుండి ఎటువంటి స్పష్టత రాలేదు.
ఇక్కడి ప్రజలు రాహుల్ను తిరస్కరించారని, నియోజకవర్గ ప్రజలకు ఆయన ఏమీ చేయలేదని స్మృతి ఇరానీ ఆరోపించారు.
2014లో అమేఠీ నియోజకవర్గం నుండి రాహుల్ గాంధీపై లక్ష ఓట్లకు పైగా మెజార్టీతో విజయం సాధించిన స్మృతి ఇరానీ నేడు రెండవ సారి బరిలో ఉన్నారు.
స్మృతి ఇరానీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్దీప్ సింగ్ సూర్జేవాలా తీవ్రంగా స్పందించారు. గతంలో చౌంద్నీచౌక్, అమేఠీలో కాంగ్రెస్ ఆమె ఓడించిందని గుర్తు చేశారు. ప్రజలు తిరస్కరించినప్పటికీ రాజ్యసభ ద్వారా పరోక్షంగా పార్లమెంట్లోకి ప్రవేశిస్తున్నారని ఆయన అన్నారు.
దక్షిణాది రాష్ట్రాలు కర్నాటక, కేరళ నుండి రాహుల్ గాంధీ పోటీ చేయాలని ఆయా రాష్ట్రాల కాంగ్రెస్ నేతలు కోరుతున్న విషయం తెలిసిందే. రాహుల్ మాత్రం ఆ ప్రతిపాదనలను తిరస్కరించినట్లు సమాచారం.