అనంతపురం, జనవరి 29: నదుల అనుసంధానం ద్వారా రాష్ట్రంలో సాగు, తాగునీటి ఇబ్బందులకు శాశ్వత పరిష్కారం చూపుతానని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అనంతపురం జిల్లా కదిరి మండలం చెర్నోపల్లి రిజర్వాయర్ను చంద్రబాబు మంగళవారం పరిశీలించారు. పుంగనూరు బ్రాంచ్ కాలువ గేట్లు తెరిచి చిత్తూరు జిల్లాకు నీళ్లు విడుదల చేశారు.
‘రాయలసీమను రతనాల సీమగా మార్చాలన్నదే తన ధ్యేయమని’ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ను హంద్రీనీవాతో అనుసంధానం చేసేందుకు నేడు జిఒ విడుదల చేసినట్లు చంద్రబాబు చెప్పారు. రాయలసీమలోని అన్ని జిల్లాలకు నీరు అందిస్తామని చంద్రబాబు చెప్పారు. పట్టిసీమ ద్వారా గోదావరి, కృష్ణానదులను అనుసంధానం చేయడం జరిగిందని అన్నారు. ప్రాజెక్టులు పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని చంద్రబాబు పేర్కొన్నారు.
రైతులు ఆదాయం వచ్చే పంటలపై దృష్టిపెట్టాలని సూచించారు.
భవిష్యత్తులో అనంతపురం నుండి వలసలు ఉండవనీ, వేరే ప్రాంతం నుండి ఇక్కడికే వలసలు వచ్చే పరిస్థతి వస్తుందని ఆయన అన్నారు.
కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టుకు ఇంకా నాలుగు వేల కోట్లు ఇవ్వాలని చెప్పారు. ఇక్కడి ప్రతిపక్షం ఆరోపణలు చేస్తూ అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తున్నారని ఆయన విమర్శించారు. కేంద్రం నుండి రావాల్సిన వాటిపై గడ్డిగా పోరాడుతామని చంద్రబాబు చెప్పారు. కేంద్రం సహకరించకున్నా ఎట్టిపరిస్థితుల్లోనూ పోలవరం పూర్తి చేసి తీరుతామనీ, మే నెలాఖరు నాటికి గ్రావిటీ ద్వారా నీరు అందిస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వివరించారు. ప్రతి ఒక్కరూ ప్రభుత్వానికి అండగా ఉండాలని చంద్రబాబు కోరారు.