కరోనా వచ్చి వ్యవస్థల్ని చిన్నాభిన్నం చేసింది. ఇదే కరోనా ఇప్పుడు ఒక ప్రజా రవాణా సంస్థకు కళ్లు తెరిపించింది. మరో సంస్థకు నష్టం చేకూర్చింది. అందులో ఒకటి ఏపీఎస్ఆర్టీసీ అయితే.. మరొకటి టీఎస్ఆర్టీసీ. లాక్ డౌన్ ముందు వరకూ ఉమ్మడి రాష్ట్ర నిబంధనల ప్రకారమే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఆర్టీసీ బస్సులు తిరిగాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఏపీఎస్ఆర్టీసీ 1లక్ష కిలోమీటర్లకు పైగానే బస్సులు నడిపింది. అయితే.. లాక్ డౌన్ సమయంలో ఇంటర్ స్టేట్ అగ్రిమెంట్ లేదనే విషయాన్ని తెలంగాణ గుర్తించింది. దీంతో తెలంగాణలోకి ఏపీ బస్సులకు మోకాలడ్డింది.
తెలంగాణ డిమాండ్.. తలొగ్గిన ఏపీ..!
అన్ లాక్ తర్వాత తెలంగాణలో ఏపీ బస్సులు తిరిగేందుకు అక్కడి ప్రభుత్వం ఒప్పుకోలేదు. రూట్ క్లియరెన్స్, పర్మిట్లు, రూట్ మ్యాప్.. అంటూ ఏపీ అధికారులను ముప్పతిప్పలు పెట్టారు. కిలోమీటర్ల పరిధి తగ్గించుకోవాలని డిమాండ్ చేశారు. అయితే.. ఏపీలో మీరు బస్సులు పెంచుకోండి.. అని తెలంగాణతో ఏపీ చెప్పినా వినలేదు. చర్చల పేరుతో పండగ సీజన్ దాటించేశారు. దాదాపు 100 కోట్లు నష్టపోయారని సమాచారం. దీపావళికైనా పునరుద్ధరించాలని ఒప్పందం కుదిర్చుకుని బస్సులు నడిపిస్తున్నారు. అయితే.. దీని వల్ల ఏపీకి ఏడాదికి 270 కోట్ల నష్టం అంచనా వేస్తున్నారు. తెలంగాణలో ప్రైవేటు బస్సులు అదనంగా 40వేల కిలోమీటర్లు తిరిగుతాయని అంటున్నారు.
కేసీఆర్–జగన్ సమస్యను తెగేదాకా లాగారా..?
ఈ విషయంలో రెండు రాష్ట్రాల సీఎంలు ఆర్టీసీ సమస్యను పరిష్కరించ లేదనే అంటున్నారు. కేసీఆర్ కు రవాణ శాఖపై పట్టు ఉంది. ఆ అనుభవంతోనే ఏపీతో చర్చలు జరపాలని.. కిమీ పంచయతీ తేల్చాల్సిందే అని ఆర్టీసీకి సూచించినట్టు తెలుస్తోంది. హైదరాబాద్ తో ఏపీకే ఎక్కువ అవసరాలు ఉన్నాయి. ప్రయాణికులు ఎక్కువ. అందుకే ఏపీ తలొగ్గిందనే వార్తలూ లేకపోలేదు. దీనికి సీఎం స్థాయిలో చర్చలు జరిపినా ఇదే జరిగేదని అంటున్నారు. లాక్ డౌన్ కు ముందు తెలంగాణలో ఏపీ 2,65,367 కిమీ తిరిగితే ఇప్పుడు 1,60,999 కిమీ తిరగనుంది. ఏపీలో తెలంగాణ 1,61,258 కిమీ మేర సర్వీసుల్ని తిప్పనుంది. హైదరాబాద్ – విజయవాడ మధ్య ఏపీ బస్సులు గతంలో 374 తిప్పితే ఇప్పుడు 192కి తగ్గించుకుంది. తెలంగాణ బస్సులు గతంలో 162 మాత్రమే తిరిగితే ఇప్పుడు 273కి పెంచుకుంది. కర్నూల్ సెక్టార్ లో 25వేల కిమీ, భద్రాచలం సెక్టార్ లో 13వేల కిమీ సర్వీసును ఏపీ తగ్గించుకుంది.