ఎవరేమనుకున్నా.. ఎంత చెప్పినా విశాఖపట్నం జిల్లాలో టీడీపీ బలంగా ఉంది. జేడీ లక్ష్మీనారాయణ జనసేన నుంచి ఎంపీ అభ్యర్ధిగా పోటీ చేయకుంటే ఆ సీటు టీడీపీనే గెలిచేది. విశాఖ తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ స్థానాలను టీడీపీ కైవసం చేసుకుంది. వీరిలో ఒకరు ఇప్పటికే వైసీపీలో చేరిపోయారు. మరొకరైన గంటా శ్రీనివాసరావు రేపో మాపో వైసీపీలో చేరేలా ఉన్నారు. గంటాను చేర్చుకునే విషయంలో వైసీపీ కూడా నాన్చుడు ధోరణిలో ఉంది. ఈ వ్యవహారాలన్నీ ఆ జిల్లాలో వైసీపీ మొదటికే ముప్పు తెచ్చేలా ఉన్నాయి.
స్వపక్షంలో విపక్షం ఎక్కువవుతున్న వేళ..
ఎమ్మెల్యే వాసుపల్లి వైసీపీలో చేరిన తర్వాత జిల్లాలో ఆయన పెత్తనం ఎక్కువైందనే వార్తలు వస్తున్నాయి. విశాఖ నగరంలో మేయర్ పీఠాన్ని జగన్ కు కానుకగా ఇస్తామని వాసుపల్లి గణేశ్ అన్నారు. పాత వైసీపీ నాయకులను సమన్వయం చేసుకోకుండా కాస్త దూకుడుగా వెళ్తున్నారట. దీంతో ఆరేడేళ్లుగా పార్టీలో చురుకుగా ఉన్న వైసీపీ నాయకులు పార్టీపై అలక చాటుతున్నారని సమాచారం. పార్టీకి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారంలోకి రావడానికి కృషి చేసిన తమను కాదని.. స్వప్రయోజనాల కోసం పార్టీలోకి వచ్చిన వారికి జగన్ ప్రాధాన్యం ఇస్తున్నారని విశాఖ ఉత్తర, తూర్పు నాయకుల్లో బాగా నాటుకుందని తెలుస్తోంది. ఇదే కొనసాగితే జగన్ తమతో మాట్లాడి వాసుపల్లి గణేశ్ కట్టడి చేయకపోతే విశాఖ మేయర్ ఎన్నికల్లో వైసీపీకి గండి కొడతామని అంటున్నట్టు తెలుస్తోంది.
గన్నవరం తరహాలోనే అసంతృప్తులు..
ఇటివలే గన్నవరం నియోజకవర్గం తేలప్రోలు నుంచి ఓ వైసీపీ కార్యకర్త మాట్లాడిన వాయిస్ రికార్డ్ వెలుగులోకి వచ్చింది. జగన్ కు 151 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఇంకెందుకు టీడీపీ నాయకులను చేర్చుకుంటున్నారని ఆయన ప్రశ్నిస్తున్నారు. ఇదే ప్రశ్న విశాఖ, చీరాల, గుంటూరు.. ఇలా అనేక ప్రాంతాల నుంచి వస్తున్నాయి. వైసీపీలోకి వస్తున్న టీడీపీ నాయకులకు స్వప్రయోజనాలే తప్ప పార్టీపై అభిమానం లేదని వైసీపీ నాయకుల వదన. వంశీ, కరణం, వాసుపల్లికి వారి వ్యాపార ప్రయోజనాల కోసమే పార్టీలోకి వచ్చారని అంటున్నారు. ఈ పరిణామాలన్నీ వైసీపీకి చేటు చేసేవేనని అంటున్నారు. ఈ సమయంలో విశాఖలో రాజధాని, మేయర్ పీఠం కోసం చూస్తున్న జగన్ కు ఈ పరిణామాలన్నీ ఆందోళన కలిగించేవనే చెప్పాలి.