హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సిఎ) అధ్యక్షుడుగా ఎన్నికైన టీమ్ ఇండియా మాజీ కెప్టెన్, కాంగ్రెస్ నేత మహమ్మద్ అజారుద్దీన్ టిఆర్ఎస్ పార్టీలో చేరనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. హెచ్సిఎ ఎన్నికల్లో గెలిచిన అజర్ ప్యానల్ ఈ రోజు ముఖ్యమంత్రి కెసిఆర్, టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్లను కలవనుంది.
ఇటీవల సార్వత్రిక ఎన్నికల్లో అజార్కు కాంగ్రెస్ పార్టీ ఎంపి టికెట్ ఇవ్వలేదు. దీంతో ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. హెచ్సిఎ ఎన్నికలకు ముందు అజర్ కెటిఆర్ను కలిసి మద్దతు కోరారు. హెచ్సిఏపై పట్టు కోసం ప్రయత్నిస్తున్న మాజీ ఎంపి వివేక్ టిఆర్ఎస్ను వీడి బిజెపిలో చేరడంతో టిఆర్ఎస్ అజర్కు మద్దతు ఇచ్చింది. ఈ సందర్భంగా పార్టీలో చేరిక గురించి కూడా చర్చ వచ్చినట్లు సమాచారం. హెచ్సిఎ ఎన్నికల్లో గెలిచిన వెంటనే అజర్ కెటిఆర్కు ఫోన్ చేసి కృతజ్ఞతలు తెలిపారు. హెచ్సిఎ ఎన్నికలకు ముందు కుదిరిన అవగాహనలో భాగంగా అజర్ టిఆర్ఎస్లో చేరతారని ప్రచారం జరుగుతోంది. నిన్న సాయంత్రం జరిగిన మీడియా సమావేశంలో టిఆర్ఎస్లో చేరికపై వస్తున్న ప్రచారాన్ని ఆయన ఖండించలేదు. రాజకీయాలకు ఇది సందర్భం కాదని మాత్రమే అజర్ వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి కెసిఆర్ను రాష్ట్రానికి బాస్గా అజర్ అభివర్ణించారు. నేడు సిఎం కెసిఆర్తో భేటీ అనంతరం అజర్ పార్టీలో చేరికపై బహిరంగ ప్రకటన చేసే అవకాశం ఉంది.
హుజూర్నగర్ ఉప ఎన్నిక నేపథ్యంలో అజర్ను టిఆర్ఎస్లో చేర్చుకోవడం ద్వారా కాంగ్రెస్ పార్టీ ఆత్మస్థైర్యం దెబ్బతీయడమే లక్ష్యంగా కెసిఆర్ పావులు కదువుతున్నారని టిఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.