హైదరాబాద్: ఏపిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి రివర్స్ గేర్లో రాష్ట్రాన్ని పాలిస్తున్నారనీ, ఇది అత్యంత ప్రమాదకరమనీ సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రీ టెండరింగ్లో కాంట్రాక్ట్ పొందిన వారికి రాష్ట్ర ప్రభుత్వం మరో మార్గంలో లబ్ది చేకూర్చకూడదని నారాయణ అన్నారు. తాను అవినీతికి మద్దతు ఇవ్వడం లేదనీ, అవినీతి ఎక్కడున్నా యద్ధం చేయాల్సిందేననీ నారాయణ అన్నారు.
రివర్స్ టెండరింగ్ వల్ల ప్రభుత్వానికి పెద్ద ఎత్తున నిధులు ఆదా అవుతాయని ఏపి ప్రభుత్వం చెప్పడంపై డబ్బు ఆదా చేయడం మంచిదేనని నారాయణ అన్నారు. అయితే రీటెండరింగ్ కాంట్రాక్ట్ తీసుకున్నవారికి భవిష్యత్తులో ఏ పద్ధతిలో గానీ ప్రభుత్వం మళ్లీ కాంట్రాక్ట్ ఇవ్వకుండా ఉంటుందా అని నారాయణ ప్రశ్నించారు. దీనికి సంబంధించి జగన్ ప్రభుత్వం హామీ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
రాజకీయాల్లో విబేధాలు ఉండవచ్చు, విమర్శలు చేసుకోవచ్చు కానీ కక్షపూరిత విధానాలు ఉండకూడదని నారాయణ హితవు పలికారు. ప్రస్తుతం కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయని నారాయణ అన్నారు.
కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 10వ తేదీ నుండి దేశ వ్యాప్త ఆందోళనకు సిద్ధమవుతున్నట్లు నారాయణ తెలిపారు.