వైసీపీకి సోషల్ మీడియాలో స్ట్రాంగ్ నెట్ వర్క్ ఉంది. వేరే ప్రాంతీయ పార్టీలకు లేనంత బలం ఉంది. ఇదే ఆ పార్టీకి ప్లస్ అని చెప్పాలి. అయితే.. వారు శృతి మించి వ్యవహరించడం పార్టీకి తలనొప్పులు తెచ్చిపెడుతోంది. ఈ క్రమంలోనే హైకోర్టును టార్గెట్ చేస్తే వైసీపీ సోషల్ మీడియా చేసిన కొన్ని పోస్టులు చర్చనీయాంశంగా మారాయి. రీసెంట్ గా హైకోర్టులో దాఖలైన ఓ పిటిషన్ కూడా కొత్త చర్చకు దారి తీసింది.
టీడీపీ నేత, మాజీ పోలీస్ అధికారి వేసిన పిటిషన్ ఏంటంటే..
కర్నూలుకు చెందిన మాజీ పోలీసు అధికారి, టీడీపీ నేత శివానంద రెడ్డి ఓ పిటిషన్ వేశారు. ‘వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు కులాలు, ప్రాంతాలు, వర్గాలుగా విడిపోయారు. వారికి చాలా పెద్ద నెట్ వర్క్ ఉంది. పార్టీలోని కీలక వ్యక్తులు వీరిని నడిపిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఆధారాలు నా వద్ద ఉన్నాయి. వీటి మూలాల్లోకి వెళ్లి విచారించాల్సిన అవసరం ఉంది. నాకు కూడా వాదనలు వినిపించే అవకాశం ఇవ్వాలని కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు’. శివానంద రెడ్డి పోలీస్ అధికారిగా పని చేసి రిటైర్ అయ్యారు. ఆయన టీడీపీ నేతగా కొనసాగుతున్నారు. హైకోర్టుపై వైసీపీ సోషల్ మీడియా విభాగం పోస్టులు వెనుక ప్రభుత్వం ఉందని కూడా ఆయన తన పిటిషన్ లో పేర్కొన్నారు. ఇందులో కుట్ర కోణం దాగుందని తన పిటిషన్ లో పేర్కొన్నారు.
వైసీపీ సోషల్ మీడియాపై విమర్శలు..
వైసీపీ సోషల్ మీడియా వింగ్ బలంగా ఉంటుంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అప్పటి మంత్రి లోకేశ్ పై చేసిన కొన్ని పోస్టులు తీవ్ర వివాదాస్పదం అయ్యాయి. ప్రభుత్వం కొందరిపై చర్యలు కూడా తీసుకుంది. పోలీసులు అరెస్ట్ చేశారు. దీనిపై అప్పట్లోనే విజయసాయిరెడ్డి ఆగ్రహం వ్యక్తం కూడా చేశారు. 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడానికి కొంత వైసీపీ సోషల్ మీడియా విభాగం కూడా కారణమైంది. ఇప్పుడు మరింత దూకుడుగా ఏకంగా హైకోర్టుపైనే విమర్శలు చేస్తున్నారు. వ్యక్తులపై, పార్టీలపై విమర్శలు ఒకెత్తు.. వ్యవస్థలపై విమర్శలు ఒకెత్తు. మరి దీనిపై దిద్దుబాటు చర్యలకు దిగుతారో.. ఇదే దూకుడుతో వెళ్తారో చూడాలి.