అమరావతి, జనవరి 28: అధికారమే పరమావధిగా దగ్గుబాటి కుటుంబం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతోందని తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆరోపించారు. ఎలక్షన్ మిషన్-2019పై పార్టీ నాయకులతో ఆయన సోమవారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. దగ్గుబాటి అన్ని పార్టీల చుట్టూ ప్రదక్షిణలు చేసి వచ్చారనీ, కాంగ్రెస్లో పురందేశ్వరి మంత్రిగా ఉంటే ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారనీ చంద్రబాబు చెప్పారు. కాంగ్రెస్ను వదిలి ఆమె భారతీయ జనతాపార్టీలో చేరారనీ, మళ్ళీ ఇప్పుడు దగ్గుబాటి వైసిపిలో చేరుతున్నారనీ ఆయన అన్నారు.
మాజీ ముఖ్యమంత్రి ఎన్టిఆర్కు అప్రతిష్ట తీసుకువచ్చేందుకు లక్ష్మీపార్వతి వైసిపితో కుమ్మక్కు అయ్యారని అరోపించారు. ఎన్టిఆర్ చరిత్రకు మచ్చతీసుకురావాలనే ఉద్దేశ్యంతోనే మరో సినిమా వైసిపి తీయిస్తోందని ఆయన ఆరోపించారు.
అందరూ ఇప్పుడు ఒకే గూటికి చేరారని దగ్గుబాటి కుబుంబాన్ని ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు. పదవులకోసం పార్టీలు మారుతున్న దగ్గుబాటి కుటుంబం తీరు గురించి ప్రజల్లోకి తీసుకువెళ్ళాలని నేతలకు ఆయన సూచించారు.
జయహో బిసి సభ విజయవంతం కావడం ‘మూడ్ ఆఫ్ ది స్టేట్’కు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. సభలో ఇచ్చిన హామీలను ప్రజలకు వివరించాలని ఆయన సూచించారు. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం గెలుపు ఏకపక్షం కానున్నదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కోల్కత్తా సభకు ధీటుగా అమరావతి ధర్మ పోరాట దీక్ష చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు.
ఆంధ్రాకు బిజెపి తీరని ద్రోహం చేసిందనీ, బిజెపి అధ్యక్షుడు అమిత్ షా రాష్ట్రానికి వస్తే ప్రజలనుండి తీవ్ర నిరసనలు వ్యక్తం అవుతాయనీ ఆయన చెప్పారు.