ఆగస్టు 5వ తారీఖున అయోధ్యలో జరగనున్న రామమందిర భూమిపూజను వాయిదా వేయాలని అన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్. ముహూర్తానికి సంబంధించిన సనాతన ధర్మ నిబంధనలు కార్యక్రమ నిర్వాహకులు పాటించలేదని, అందువల్లే ఈ కార్యక్రమం తో సంబంధం ఉన్న చాలామంది మహమ్మారి కరోనా వైరస్ బారిన పడుతున్నారని చెప్పారు.
రామ మందిరానికి సంబంధించిన పూజారులు యూపీ మంత్రి కమలా రవి, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్, కర్ణాటక సీఎం ఎడ్యూరప్ప కరోనా బారిన పడ్డారని గుర్తు చేశారు. వేల ఏళ్లుగా హిందువులు పాటిస్తున్న సనాతన ధర్మాలు, నిబంధనలు, సాంప్రదాయాల తో ఆడుకోకూడదని మోడీకి దిగ్విజయ్ సింగ్ సూచించారు.
రాముడు వేల ఏళ్లుగా హిందువుల భక్తి విశ్వాసాలకు కేంద్ర బిందువుగా ఉన్నాడని చెప్పారు దిగ్విజయ్. వందల ఏళ్ళ కాలం తర్వాత రామమందిర నిర్మాణం కాబోతున్న తరుణంలో ఈ విషయంలో మోడీ తన మొండి పట్టుదలను విడిచిపెట్టాలని దిగ్విజయ్ చెప్పుకొచ్చారు. లేకపోతే నిర్మాణానికి ఆటంకం కలిగే అవకాశం ఉందని అన్నారు.
ఈ విషయంలో యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కలగజేసుకుని రామ మందిర భూమి పూజ వాయిదా వేసేలా ప్రధాని మోడీని అభ్యర్ధించాలని, పరిస్థితులు బాగాలేవని, ప్లీజ్ ఆ పని ఎలాగైనా చేయండి అంటూ దిగ్విజయ్ అభ్యర్థిస్తున్నారు. పరిస్థితిలు చాలా ప్రమాదకరంగా ఉంటున్న సమయంలో అయోధ్య భూమి పూజ కార్యక్రమం నిర్వహిస్తే, చాలా మంది ఆసుపత్రి పాలయే అవకాశం ఉందని, కాదని మొండిగా భూమిపూజ నిర్వహిస్తే కరోనా వైరస్ మీరే వ్యాపింప చేసినవారవుతారు అంటూ దిగ్విజయ్ విమర్శలు చేశారు.