అమరావతి, ఏప్రిల్ 28: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల నిర్వహణ కోసం ప్రధాన కార్యదర్శి(సీఎస్) ని ఎన్నికల సంఘం నియమిస్తే సీఎస్ పరిధి దాటి వ్యవహరిస్తున్నారని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కెఎస్ జవహర్ అన్నారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ ప్రజాప్రభుత్వం ఉన్నప్పుడు ఆపద్ధర్మ ప్రభుత్వము ఉన్నట్లు వ్యవహరించాలని సీఎస్ చెప్పటం హాస్యాస్పదమని జవహార్ పేర్కొన్నారు.
ఫణి తుపాన్ రాష్ట్రం వైపు దుసుకువస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను అప్రమత్తం చేయటం నేరమా అని జవహర్ ప్రశ్నించారు. తుపాను కారణంగా రాష్ట్రవ్యాప్తంగా తీవ్రమైన నష్టం వాటిల్లితే ఎవరు బాధ్యత వహిస్తారని జవహర్ ప్రశ్నించారు. సమీక్షలు చేయకపోతే పాలనాపరమైన వ్యవహారాలు ఎవరు చూస్తారు ? ఎన్నికల సంఘమా లేకా నరేంద్రమోదీనా అంటూ జవహర్ మండి పడ్డారు.
కేంద్రంలో ఎక్కడా క్యాబినెట్ కార్యదర్శి జోక్యం చేసుకోవడం లేదు.కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఈసి నియమించిన సీఎస్ ఎందుకు జోక్యం చేసుకుంటున్నారో తెలియటం లేదని జవహర్ అన్నారు. పోలవరం ప్రాజెక్టు పనులు ప్రారంభించింది ప్రజా ప్రభుత్వం.దాన్ని పూర్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.అలాంటిది పోలవరం ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి రివ్యూ చేయకూడదు అనటం విడ్డురంగా ఉందని జవహర్ అన్నారు.
ప్రధానంగా రాష్ట్రంలోని దళిత,గిరిజన వాడల్లో తాగునీటి ఇబ్బదులు రాకుండా ఉండాలని ముందస్తు ప్రణాళిక ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించటం నేరమా అని జవహర్ ప్రశ్నించారు. సీఎస్ ఎల్వి సుబ్రమణ్యం చేసిన వ్యాఖ్యలు మాలిఫైడ్ ఇంటెన్షన్తో మాట్లాడినట్లు ఉన్నాయని అన్నారు. ప్రధాని మోదీ సారథ్యంలో విజయసాయిరెడ్డి దూతగా సీఎస్ వ్యయహరిస్తున్నారని మంత్రి జవహర్ దుయ్యబట్టారు.ఇదే పరిస్థితి కొనసాగించాలని చూస్తే ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని జవహర్ హెచ్చరించారు.