ఉత్తరాంధ్రలో పేరున్న నాయకులు, రాష్ట్రవ్యాప్తంగా వార్తల్లో ఉండే నాయకుడు గంటా శ్రీనివాసరావు. ఆయన రాజకీయ మనుగడ ఏంటో ఆయనకే తెలియడం లేదు. టీడీపీలోనే ఉండాలా.. వైసీపీలోకి వెళ్లాలా.. లేక బీజేపీ తీర్ధం పుచ్చుకోవాలో తెలీని డైలమాలో ఉన్నారు. వైసీపీలోకి వెళ్లిపోతారని దాదాపు ఖరారైన వేళ ఆయన ఆగిపోయారు. మరి.. ఆయన రాజకీయ అడుగులు ఎటు పడబోతున్నాయి. టీడీపీలోనే ఉంటారా.. ఆలస్యమైనా వైసీపీలోకి వెళ్తారా.. బీజేపీకి జై కొడతారా అనేది రాజకీయ వర్గాల్లో ప్రశ్నార్ధకంగా మారింది.
వైసీపీలో చేరకపోవడానికి కారణం..
వైసీపీలోకి గంటా వెళ్లడం దాదాపు ఖరారైన వేళ ఆయనకు ఎంపీ విజయసాయి రెడ్డి, మంత్రి అవంతి చెక్ పెట్టారని తెలుస్తోంది. గంటా రాక సీఎం జగన్ కు ఇష్టమైనా స్థానిక నాయకత్వ అభిప్రాయాలకే విలువ ఇవ్వాల్సి వచ్చిందని తెలుస్తోంది. ముఖ్యంగా అవంతి శ్రీనివాసరావుతో టీడీపీ హయాంలో ఉన్నప్పుడే వీరిద్దరి మధ్య విబేధాలు ఉన్నాయని అంటారు. టీడీపీలో గంటా మంత్రిగా ఉన్న సమయంలోనే విశాఖ భూ వివాదాల నేపథ్యంలో ఎంపీగా ఉన్న అవంతి పరోక్షంగా ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు బాధ్యతలు చేపట్టిన తర్వాత రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. రాష్ట్రంలోని కాపు కమ్యూనిటీని బీజేపీ వైపు బలపరచాలని ఆయన ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఆయన చిరంజీవిని, ముద్రగడను కలిశారు. ఇప్పటికే పవన్ కల్యాణ్ జనసేనతో మిత్రపక్షంగా ఉండటం కలిసొస్తోంది. ఈ నేపథ్యంలో గంటాను బీజేపీలోకి ఆహ్వానిస్తే ఉత్తరాంధ్రలో పార్టీ బలపడుతుందని భావిస్తున్నారు.
టీడీపీలోనే ఉండిపోతారా..
అయితే.. ఇప్పటికే పలు పార్టీలు మారారని గంటాపై అనేక విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు మరోసారి పార్టీ మారితే ఎదుర్కొనే విమర్శలు అవసరమా అనే భావనలో ఉన్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. అయితే.. టీడీపీలో గంటా తన పని తాను చేసుకునేవారు. టీడీపీ కూడా గంటాకు చేసిన అన్యాయం లేదు. దీంతో ఎప్పటిలా టీడీపీలోనే సైలెంట్ గా ఉండొచ్చని ఆలోచిస్తున్నారా.. ఈ మేరకు కార్యకర్తలతో సమాలోచనలు జరుపుతున్నారా.. అనేది తెలియాల్సి ఉంది.