అమరావతి: రాష్ట్రంలో పరిస్థితులు జనసేన పార్టీకి అనుకూలంగా ఉన్నాయనీ, ఎగ్జిట్ పోల్స్ చూసి జనసేన కార్యకర్తలు ఎవ్వరూ అధైర్యపడాల్సిన అవసరం లేదని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ మాదాసు గంగాధరం అన్నారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో బుధవారం మాదాసు మాట్లాడుతూ జనసేన పార్టీకి అనుకూలంగా సైలెంట్ ఓటింగ్ జరిగిందని అన్నారు.
ముఖ్యంగా కౌంటింగ్ సందర్బంగా ఏజంట్లు తగు జాగ్రత్తలు తీసుకోవాలనీ, దీనిపై అవగాహన కలిగించేందుకు పార్టీ తరఫున ఇప్పటికే బుక్స్ ఇచ్చామనీ మాదాసు గుర్తు చేశారు. కౌంటింగ్ ప్రక్రియలో ఎక్కడ ఏ మాత్రం అనుమానం వచ్చినా వాదప్రతివాదాలకు తావు ఇవ్వకుండా రిటర్నింగ్ ఆఫీసర్కు లిఖిత పూర్వకంగా తెలియపర్చాలని మాదాసు సూచించారు.
కేవలం జనసేన పార్టీ మాత్రమే ఈ ఎన్నికల్లో డబ్బుకు ప్రాధాన్యత ఇవ్వలేదనీ, సామాన్యుడికి రాజకీయ జీవితం ఇచ్చే ఉద్దేశంతో పార్టీ అధినేత పవన్కళ్యాణ్ టికెట్లు ఇచ్చారని మాదాసు గుర్తు చేశారు. ప్రత్యర్ధి పార్టీలు ఓట్ల కోసం కోట్లాది రూపాయిలు ఖర్చు చేశాయనీ, అణగారిన వర్గాలు, మైనారిటీల మద్దతుతో జనసేన పార్టీ ముందుకు వెళ్లిందని మాదాసు పేర్కొన్నారు. ఇది చూసి ఓర్వలేక పాలక, ప్రతిపక్షాలు ఎగ్జిట్ పోల్స్ ముసుగులో మైండ్ గేమ్ ఆడుతున్నాయని మాదాసు విమర్శించారు.
ఎగ్జిట్ పోల్స్ అంచనాలు చాలా సందర్బాల్లో తల్లకిందులయ్యాయనీ, తెలంగాణ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ ఏమయ్యాయన్నది అందరికీ తెలిసిందేనన్నారు.
ఎగ్జిట్ పోల్స్ అనేది ఇప్పుడు ఒక వ్యాపారం అయిపోయిందనీ, వీటి వల్ల బెట్టింగులు కట్టి చాలా సంసారాలు నాశనం అయిపోయాయని మాదాసు అన్నారు.
యువత, మహిళలు, బిసిలు, షెడ్యూల్ కులాల నుంచి జనసేన పార్టీకి కావల్సినంత మద్దతు లభించినట్లు పార్టీ అంతర్గత నివేదికల ఆధారంగా స్పష్టమవుతోందని మాదాసు పేర్కొన్నారు.
చాలా మంది పార్టీ అధినేత పవన్కళ్యాణ్ను కలవాలని మెసేజ్లు పెడుతున్నారనీ, ఎవరూ విజయవాడ పార్టీ కార్యాలయానికి రావద్దని మాదాసు సూచించారు. జనసైనికులు నియోజకవర్గాల్లోనే ఉండి అభ్యర్ధులకు సహాయ సహకారాలు అందించాలని మాదాసు కోరారు. త్వరలో పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అందరినీ కలిసి మాట్లాడతారని మాదాసు గంగాధరం తెలిపారు.