KCR.. అనుకున్నది సాధించేందుకు ఎంతవరకైనా వెళ్తారు.. అవకాశాలను ఒడిసి పట్టడంలో నేర్పరి.. రాజకీయంగా నిర్ణయాలు తీసుకోవడంలో దిట్ట..! సినీ భాషలో చెప్పాలంటే.. త్రివిక్రమ్ రాసిన.. ‘డిప్ప మీద కొట్టి ఏడ్చేలోపు చాక్లెట్ చేతిలో పెట్టేస్తారు’ అనే డైలాగ్ సీఎం కేసీఆర్ కు వెన్నతో పెట్టిన విద్య. తెలంగాణ సాధనలో ఆయన అవలంబించిన విధానం.. సీఎం అయ్యాక వివిధ పరిస్థితుల్లో ఆయన వ్యవహరించిన తీరు ఇందుకు నిదర్శనం. 2019లో జరగాల్సిన అసెంబ్లీ ఎన్నికలను ఆరు నెలల ముందే జరిపించి మళ్లీ అధికారం సాధించారు. ఇలా ప్రతి విషయంలో తన వ్యూహాలను అమలు చేసే కేసీఆర్ ఇప్పుడు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మళ్లీ చాణక్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఉమ్మడి మహబూబ్నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో మాజీ ప్రధాని పీవీ కుమార్తెను రంగంలోకి దించారు.
KCR. కేసీఆర్ రూటే సపరేటు..
‘సీఎం’లందు కేసీఆర్ తీరే వేరయా.. అన్నట్టు ఉంటుంది ఆయన విధానం. మొన్నటివరకూ ఈ ఎన్నకల్లో టీఆర్ఎస్ దూరంగా ఉంటుందనే అనుకున్నారు. పార్టీ వర్గాల్లో కూడా ఇదే అభిప్రాయం వ్యక్తమైంది. అయితే.. అనూహ్యంగా పీవీ కుమార్తె సురభి వాణీదేవిని ఖరారు చేశారు. ఈరోజు ఆమె నామినేషన్ వేయనున్నారు. ఇందులో కేసీఆర్ వ్యూహం ఏంటంటే.. సామాజివర్గంగా ఓట్లు చీల్చాలని చేసే ప్రయత్నాలు ఉన్నాయి. బీజేపీ నేత రామచంద్రరావుతో పాటు పోటీలో ఉన్న మరో ఇద్దరు కూడా వాణీదేవి సామాజికవర్గానికి చెందిన వారే. గతంలో జేఎన్టీయూలో పని చేసి ప్రస్తుతం శ్రీ వేంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ ప్రిన్సిపాల్గా ఉన్నారు. దీంతో విద్యార్ధుల ఓట్లు సంపాదించేందుకు కూడా ఇదొక ఎత్తు అని చెప్పాలి. ఇటివలే పీవీకి భారతరత్న కోసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. పీవీ స్మారకం ఏర్పాటు చేస్తున్నారు. శతజయంతి ఉత్సవాల కోసం ఏర్పాట్లు చేశారు. కాంగ్రెస్ చేయనిది తాము చేస్తున్నామని చెప్పుకుంటూ ఓట్లు సాధించేందుకు కూడా ఇదొక ఎత్తు అని చెప్పొచ్చు. మొత్తంగా తాను గెలిచేందుకు అందుబాటులో ఉన్న వనరులను ఉపయోగిస్తున్నారని చెప్పాలి.
పీవీపై ప్రేమ ఉంటే..
ఇతర పార్టీలను రెచ్చగొట్టే తరహాలో సాగే కేసీఆర్ ప్రయత్నాలు సహజంగనే ఇప్పుడూ వారికి ఆగ్రహం తెప్పించాయి. విమర్శలు చేస్తూ కేసీఆర్ పై విరుచుకుపడుతున్నారు. వీరిలో స్వయానా పీవీ మనవడు, బీజేపీ నేత ప్రముఖంగా నిలుస్తున్నారు. ఈ జిల్లాల్లో టీఆర్ఎస్ గెలవడం అసాధ్యమని అంటున్నారు. టీఆర్ఎస్, కేసీఆర్ పై ఉన్న వ్యతిరేకతకు పీవీ కుమార్తెను బలి చేస్తున్నారంటూ విమర్శిస్తున్నారు. పీవీపై ప్రేమను చూపాలంటే వాణీదేవికి నామినేటెడ్ పదవి లేదా ఎమ్మెల్సీ కోటాలోనో ఎమ్మెల్సీని చేయాలని కానీ.. ఓడిపోయే సీటు ఇచ్చి పోటీలో నిలబెట్టడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. సామాజికవర్గ ఓట్లను చీల్చడమే లక్ష్యంగా కేసీఆర్ కుయుక్తులు పన్నుతున్నారని ఆరోపిస్తున్నారు. ఇక కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి కూడా.. కాంగ్రెస్ విజయావకాశాలను దెబ్బ తీసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారు. కానీ.. కేసీఆర్ పాచికలు పారే రోజులు పోయాయని అంటున్నారు. స్వయంగా కేసీఆర్, కేటీఆర్ వచ్చి నిలబడినా ఇక్కడ టీఆర్ఎస్ గెలవడం అసాధ్యమంటున్నారు. మొత్తానికి ఎమ్మెల్సీ ఎన్నిక రసవత్తరంగా జరుగనుంది.
కేసీఆర్ వ్యూహం ఫలించేనా..
వైవీఎస్ చౌదరి తీసిన లాహిరి లాహిరి లాహిరిలో.. సినిమాలో హరికృష్ణతో.. ‘అచ్చమాంబ ఆలోచన చేసిందంటే దానికి విత్తనం ఎక్కడో వేసే ఉంటుంది’ అనే డైలాగ్ ఉంటుంది. ఎలా ఆలోచించినా కేసీఆర్ ఇందుకు సరిగ్గా సరిపోతారని చెప్పాలి. ఎమ్మెల్సీ ఎన్నిక కోసమే అని కాదు కానీ.. అక్కరకు అవసరం వచ్చేలా గతంలోనే పీవీ జపం చేశారని చెప్పాలి. పీవీ శతజయంతి ఆయనకు అందివచ్చింది. పీవీ కుటుంబం కూడా ప్రభుత్వం నుంచి ఇంత స్పందన ఊహించి ఉండదు. ఇప్పుడు ప్రతిష్టాత్మకం అవుతున్న ఎన్నిక కాబట్టి.. వాణీదేవి కూడా విద్యారంగంలోనే ఉన్నారు కాబట్టి.. తమ గెలుపుకు ఉపయోగపడతారనే ఆమెను ఎన్నికల్లో నిలబెడుతున్నారని చెప్పాలి. గొంతెత్తి చించుకుని, నిరసనలు, దీక్షలు చేసిన ఆర్టీసీ కార్మికులను కనీసం చర్చలకు కూడా పిలవలేదు. వారు విసుగెత్తిన తర్వాత.. పిలిచి వారికి వరాలిచ్చేశారు. దీంతో కేసీఆర్ కు పాలాభిషేకాలు జరిగిపోయాయి. ఇలాంటి వ్యూహాల్లో కేసీఆర్ దిట్ట. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీవీకి చేస్తోంది కేసీఆర్ ప్రత్యేకించి చెప్పుకునే పని లేదు. అంతగా పీవీ ఇంపాక్ట్ తెలంగాణపై పడేలా చేశారు. మరి పీవీ అస్త్రం ఏమేరకు పని చేస్తుందో చూడాలి.