అమరావతి: జగన్ సారధ్యంలో వైసిపి సృష్టించిన సునామీలో అధికారపక్షంలో హేమాహేమీలు ఇంటిదారి పట్టారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో ముగ్గురు మంత్రులు మినహా అందరూ మట్టికరిచారు. వైసిపి ప్రభంజనాన్ని తట్టుకుని గెలిచిన టిడిపి సభ్యుల్లో మంత్రులు ఘంటా శ్రీనివాసరావు, నిమ్మకాయల చినరాజప్ప, కింజరపు అచ్చెన్నాయుడు ఉన్నారు.
కుప్పంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయం సాధించారు. అయితే ఆయన మెజారిటీ గణనీయంగా తగ్గింది. సత్తెనపల్లిలో శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాద రావు వైసిపి అభ్యర్ధి అంబటి రాంబాబు చేతిలో పరాజయం పాలయ్యారు. డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ కూడా ఓడిపోయారు.
ఇక మంత్రుల్లో ముఖ్యమంత్రి తనయుడు నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గంలో వైసిపి అభ్యర్ధి ఆళ్ల రామకృష్ణారెడి చేతిలో పరాజయం పాలయ్యారు. చంద్రబాబు మంత్రిమండలిలో సోమిరెడ్డి చంద్రమోహన రెడ్డి, కెఎస్ జవహర్, పి.నారాయణ, కళా వెంకట్రావు, అమరనాధ్ రెడ్డి, అఖిలప్రియ, సుజయకృష్ణ రంగారావు, శిద్దా రాఘవరావు, అయ్యన్నపాత్రుడు, పత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనందబాబు, దేవినేని ఉమ, పితాని సత్యనారాయణ, కొల్లు రవీంద్ర, పరిటాల సునీత, సిహెచ్ ఆదినారాయణ రెడ్డి పరాజయం పొందారు. తండ్రి మరణంతో మంత్రివర్గంలో చేరి ఎన్నికలకు కొద్ది ముందు సాంకేతిక కారణాలతో బయటకు వచ్చిన అరకు నియోజకవర్గం అభ్యర్ధి కిలారి శ్రావణ్ కుమార్ కూడా ఓడిపోయారు.