అమరావతి: ఆంధ్రప్రదేశ్లో మరోసారి టిడిపినే విజయభేరి మోగిస్తుందనీ, చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి కావటం తథ్యమనీ ఆ పార్టీ నేత,ఎంపి జేసి దివాకర్రెడ్డి ధీమా వ్యక్తంచేశారు. పసుపు-కుంకుమ, పెన్షన్ పథకాలే టిడిపిని కాపాడతాయని ఆయన అన్నారు. ఈ రెండు పథకాలు లేకపోతే టిడిపి పరిస్థితి భగవంతుడికే తెలియాలన్నారు.
టిడిపి విస్తృతస్థాయి సమావేశం కోసం జేసి నేడు అమరావతి వచ్చారు. ఈ సందర్భంగా జేసి మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు ఎంత కష్టపడ్డారో ప్రజలకు తెలుసన్నారు. చంద్రబాబు దాదాపుగా 120 సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టారని జేసి గుర్తుచేశారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు దేశంలో మరే రాష్ట్రంలోనూ లేవని ఆయన పేర్కొన్నారు.
అదేవిధంగా ఎన్నికల్లో అభ్యర్థులు ఖర్చుపై ఆయన తన అభిప్రాయాలను మీడియాతో పంచుకున్నారు. మొన్నటి ఎన్నికల్లో అన్ని పార్టీలు కలిపి 10 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశాయని జేసి అన్నారు. ఒక్కో అభ్యర్థి 25 కోట్ల రూపాయలకు తక్కువ కాకుండా ఖర్చు చేశారని చెప్పారు. తన నియోజకవర్గంలో సుమారు 50 కోట్ల రూపాయలు ఖర్చయిందని తెలిపారు.
ఓటేయండని కోరితే ప్రజలు రెండు వేల రూపాయలు ఇవ్వాలని అడుగుతున్నారని జేసి విస్మయం వ్యక్తం చేశారు. ఇకపై ఎన్నికల్లో ఒక్కో ఓటుకు ఐదు వేల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదన్నారు.
ఎన్నికల్లో డబ్బు ప్రభావం తగ్గించాలన్నదే తన తపనని జేసి చెప్పుకొచ్చారు. ఇందుకోసం ఒక వేదికను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. జస్టిస్ జాస్తి చలమేశ్వర్, జయప్రకాశ్ నారాయణ లాంటి మేధావులతో కలిసి ఈ వేదికను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. వచ్చే ఐదేళ్లలో కచ్చితంగా ఎన్నికల ఖర్చులు తగ్గించేందుకు ప్రయత్నిస్తానని జేసి పేర్కొన్నారు.