Nara Lokesh: నారా లోకేశ్ Nara Lokesh టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. పార్టీలో, నాయకుల్లో, శ్రేణుల్లో ఆయనపై ఎటువంటి అంచనాలు ఉన్నాయో.. అందుకు తగ్గట్టుగానే ఆయన ముందుకెళ్తున్నారు. రీసెంట్ గా ఆయన పర్యటనలు చూస్తే ఇదే అర్ధమవుతోంది. అయితే.. ఆయన రాజకీయ పరిణితిపై ఇప్పటికీ ప్రతిపక్షాలు, సోషల్ మీడియాలో ట్రోల్స్ వస్తూనే ఉంటాయి. ఎమ్మెల్సీ హోదాలో గత టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా పని చేశారు. 2019 ఎన్నికల్లో తొలిసారి ప్రజాక్షేత్రంలో అడుగుపెట్టి మంగళగిరి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. దీంతో ఆయన చరిష్మాపై రాజకీయంగా అనేక అనుమానాలు నెలకొన్నాయి. ఇప్పుడు 2024 ఎన్నికలకు ఈసారి మంగళగిరి నుంచి పోటీ చేసే విషయంలో తన నిర్ణయం మార్చుకున్నారని తెలుస్తోంది.
వచ్చే ఎన్నికల్లో ఆయన మంగళగిరి నుంచి కాకుండా ప్రత్యామ్నాయ నియోజకవర్గం కోసం చూస్తున్నట్టు సమాచారం. దీనిపై ఇప్పటినుంచే సర్వే చేయిస్తున్నారట కూడా. ఈక్రమంలో ఆయనకు విశాఖ జిల్లా భీమిలీ నియోజకవర్గం సేఫ్ అని భావిస్తున్నారని పార్టీ వర్గాలు అంటున్నాయి. దీంతో తనకు పరాభవం ఎదురైన మంగళగిరిని వదిలేయనున్నారని అంటున్నారు. రాజధాని ప్రాంతం కావడంతో అక్కడ గెలుపుపై ఆశలు పెట్టుకున్న లోకేశ్ కు అక్కడ ఓటమి ఆయనకే కాదు.. పార్టీకి కూడా పెద్ద షాక్ అనే చెప్పాలి. అందుకే ఎన్నికల్లో పోటీకి నియోజకవర్గ మార్పు ఆలోచిస్తున్నట్టు సమాచారం. అయితే.. భీమిలీ మాత్రం లోకేశ్ కు ఎంత సేఫ్..? అనేదే ఇప్పుడు ప్రశ్న. భీమిలీ నుంచి వైసీపీ తరపున అవంతి శ్రీనివాసరావు బరిలో ఉన్నారు. పైగా.. ఆయనకు ఇది సొంత నియోజకవర్గం.
Read More: YSRCP: వైసీపీలో కొత్త బెంగ… ఆ 11 మంది ఎమ్మెల్సీలు ఎవరో, ఎప్పుడో..!?
2014లో భీమిలీ నుంచి గంటా శ్రీనివాసరావు టీడీపీ నుంచి గెలిచారు. 2019లో అక్కడ వైసీపీ నుంచి అవంతి శ్రీనివాసరావు గెలిచారు. స్థానిక బలం ఆయనకు కలిసొచ్చింది. అక్కడ టీడీపీకే పట్టు ఉంటే గంటా లేకపోయినా టీడీపీ గెలిచి ఉండాల్సింది. అలా జరగలేదు. 2024లో కూడా అవంతి భీమిలీ నుంచే పోటీ చేయడం ఖాయం. మరి ఈ నేపథ్యంలో లోకేశ్ భీమిలీ నుంచి పోటీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తే ఈసారి గెలుపు అవకాశాలెలా ఉంటాయో చూడాల్సిందే. ‘పోయినచోటే వెతుక్కుంటాను.. మంగళగిరిని వదిలిపెట్టను’ అని ఎన్నికల అనంతరం ఓ ఇంటర్వ్యూలో చెప్పారు లోకేశ్. ఎన్నికలకు మరో మూడేళ్లు సమయం ఉన్నందున లోకేశ్ నిర్ణయం ఎలా ఉంటుందో చూడాల్సి ఉంది.