అమరావతి, ఫిబ్రవరి 6: సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ అధికార, ప్రతిపక్ష పార్టీలు ఎదుటిపక్షంలోని నేతలకు గాలం వేస్తున్నాయి. అది సాధ్యపడకపోతే వారి రక్తసంబంధీకులు, బంధువులను లాగేస్తున్నాయి. ప్రత్యర్థి పక్షంలోని నేతలను పార్టీలో చేర్చుకోవడం ద్వారా ఆ పార్టీని బలహీనపర్చాలని చూస్తున్నాయి.
ఈ రోజు టిడిపి నాయకులు ఇద్దరి బంధువులు వైఎస్ఆర్సిపిలో చేరారు. టిడిపి ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న సోదరుడు బుద్దా నాగేశ్వరరావు, టిడిపి ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య సోదరుడు వర్ల రత్నంలు వైసిపిలో చేరారు.
కడప జిల్లాలో ఎకైక టిడిపి ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి టిడిపిని వీడి వైసిపిలో చేరారు. ఆయన సోదరుడు విజయశేఖరరెడ్డి టిడిపిలోనే కొనసాగుతున్నారు. అదే జిల్లాకు చెందిన టిడిపి మాజీ మంత్రి ఖలీల్ బాషా వైసిపిలో చేరారు. చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ టిడిపిని వీడి వైకాపా చేరేందుకు మంగళవారం కార్యకర్తల సమావేశం కూడా నిర్వహించారు. నేటి ఉదయం వైసిపి అధినేత జగన్మోహనరెడ్డితో ఆమంచి భేటీ కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో మంత్రి శిద్ధా రాఘవరావు ఆమంచితో చర్చలు జరిపారు. నేటి మధ్యాహ్నం మూడు గంటలకు చంద్రబాబుతో కలిసి మాట్లాడేందుకు ఆమంచిని మంత్రి సిద్ధా ఒప్పించారు. చంద్రబాబుతో సమావేశం ఖరారు అయిన నేపథ్యంలో జగన్తో భేటీని ఆమంచి రద్దు చేసుకున్నారు.
ఇటీవల మాజీ కేంద్ర మంత్రి, బిజెపి నాయకురాలు దగ్గుపాటి పురందరీశ్వరి కుమారుడు వైసిపి తీర్థం పుచ్చుకున్నారు.
మరో పక్క రాయలసీమలో మాజీ ముఖ్యమంత్రి కుమారుడు, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు కోట్ల సూర్యప్రకాశరెడ్డి టిడిపిలో చేరేందుకు గ్రౌండ్ వర్క్ చేసుకున్నారు. ఆయన సోదరుడు కోట్ల హర్షవర్థన్ రెడ్డి వైసిపిలో చేరారు. ఉత్తరాంధ్రలో కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ కేంద్ర మంత్రి కిషోర్ చంద్రదేవ్ కూడా ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆయన టిడిపిలో చేరనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
బిజెపికి చెందిన రాజమండ్రి ఎమ్మెల్యే సత్యనారాయణ జనసేన పార్టీలో చేరారు. విజయవాడలో దివంగత నేత వంగవీటి రంగా తనయుడు మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధ ఇటీవల వైకాపాకు రాజీనామా చేశారు. ఆయన ఇంత వరకూ ఏ పార్టీలో చేరుతున్నారో అధికారికంగా వెల్లడించలేదు. ఆయన టిడిపిలో చేరుతున్నారని ప్రచారం జరిగినా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. పార్టీ వలసల సీజన్ ప్రారంభం కావడంతో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది.