జాతీయ కాంగ్రెస్ పార్టీలో కలహాలు కాపురం చేస్తున్నట్లు మరో సారి బహిర్గతం అయ్యాయి. మిగతా పార్టీలతో పోల్చుకుంటే మొదటి నుండి కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువే అన్న విషయం అందరికీ తెలిసిందేే. గ్రూపు రాజకీయాలు, పార్టీ అధిష్టాన నిర్ణయాలను ఎగర్తించడాలు, ఎవరి అభిప్రాయాలను వారు నిర్బయంగా వెల్లడించడాలు చేస్తూనే ఉంటారు. దేశంలో రాహుల్ గాంధీ పార్టీ పగ్గాలు చేపట్టిన తరువాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయాలను చవి చూసింది. గత సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం ఘర ఓటమికి నైతిక భాద్యత గానో, మనస్థాపం చెందో రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్ష బాధ్యతలను త్యజించడం, పార్టీ ముఖ్య నేతలు ఆయనను తిరిగి కొనసాగించేలా చేసిన ప్రయత్నాలు విఫలం కావడం, దరిమిళా సోనియా గాంధీనే తాత్కాలిక అధ్యక్షత బాధ్యతలు నిర్వహిస్తున్న సంగతి విదితమే. అయితే ప్రస్తుతం దేశంలో కాంగ్రెస్ పార్టీ తీవ్రగడ్డుపరిస్థితిని ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో పార్టీ పూర్వవైభవం తీసుకురావడానికి తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు చేస్తూ 23 మంది సీనియర్ నేతలు ఇటీవల సోనియా గాంధీకి లేఖ రాశారు. ఈ విషయం మీడియాలోనూ వచ్చింది. సీనియర్లు సోనియాకు లేఖ రాయడం రాహుల్ గాంధీకి ఆగ్రహం తెప్పించింది.
సోమవారం సోనియా గాంధీ అధ్యక్షతన సిడబ్ల్యూసి సమావేశంలో రాహుల్ గాంధీ సీనియర్ నేతలపై నిప్పులు చేరిగారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాజకీయాలు క్లిష్టతరంగా ఉన్న ఈ తరుణంలో సీనియర్ కూడబలుక్కుని లేఖ రాయడం ఏమిటని సీనియర్లపై రాహుల్ మండిపడ్డారు. ఒ పక్క సోనియా గాంధీ ఆరోగ్యం ఏ మాత్రం బాగోలేదన్నారు. ఈ సమయంలో సీనియర్లు లేఖ రాయడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టడంతో పాటు వారిపై ఆరోపణలు సంధించారు. బిజెపితో అసమ్మతి నేతలు చేతులు కలిపారంటూ ఆరోపించారు. పార్టీలో అంతర్గతంగా చర్చించాల్సిన విషయాలను బహిరంగ పరుస్తున్నారనీ, పార్టీ విషయాలు ప్రత్యర్థులకు కూడా తెలిసిపోతున్నాయని అన్నారు రాహుల్ గాంధీ. రాహుల్ చేసిన ఈ వ్యాఖ్యలతో సిడబ్ల్యుసి సమావేశం ఒక్క సారిగా వేడెక్కింది. సీనియర్ నేతలు సోనియా గాంధీ లేఖ రాయడాన్ని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా తప్పుబట్టారు. లేఖ రాయడం దురదృష్టకరమని, ఈ చర్యలు పార్టీ అధిష్టానాన్ని బలహీన పరుస్తుందని మన్మోహన్ సింగ్ వ్యాఖ్యానించారు. మరో సీనియర్ నేత ఆంటోని కూడా లేఖ రాయడంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై సీనియర్ నేతలు గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్ లు ఘాటుగా స్పందించారు.
రాహుల్ గాంధీ ఆరోపించినట్లు తాను నిజంగా బిజెపి ఏజంట్ ను అయితే తక్షణం పార్టీకి రాజీనామా చేసి బయటకు వెళ్లిపోవడానికి కూడా సిద్ధమని గులామ్ నబీ ఆజాద్ పేర్కొన్నారు. సిడబ్ల్యుసి సభ్యుల వ్యవహార శైలి కారణంగా తాము లేఖ రాయడం జరిగిందని రాహుల్ గాంధీకి వివరించారు అజాద్. కాగా రాహుల్ వ్యాఖ్యలపై రాజ్యసభ సభ్యుడు, మరో సీనియర్ నేత కపిల్ సిబల్ ట్విట్టర్ వేదికగా తీవ్రంగా స్పందించారు. తాము బిజేపితో కుమ్ముక్కు అయ్యామంటారా అని మండిపడ్డారు. రాజస్థాన్ హైకోర్టులో విజయవంతంగా వాదించి కాంగ్రెస్ ను నిలబెట్టింది ఎవరు, మణిపూర్ లో బిజెపిని తొలగించి కాంగ్రెస్ ను కాపాడింది ఎవరు. గత 30 ఏళ్లుగా బిజేపికి అనుకూలంగా ఒక్క ప్రకటన అయినా చేయడం చూశారా, తమను బిజెపితో కుమ్మక్కుయ్యామంటారా అని ప్రశ్నల వర్షం కురిపించారు. అయితే ఈ ట్వీట్ చేసిన కొెద్ది సేపటికే కపిల్ సిబల్ తూఛ్ అంటూ ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నానని ప్రకటించారు.
ఇది ఇలా ఉండగా తాను కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలిగా కొనసాగలేనని, బాధ్యతల నుండి తప్పుకుంటున్నానని సోనియా గాంధీ స్పష్టం చేశారు. నూతన అధ్యక్షుడిని ఎన్నుకోవాలని సిడబ్ల్యూసి సభ్యులకు సూచించారు. సోనియా రాసిన లేఖను జాతీయ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ సభ్యులకు వివరించారు. అయితే సోనియా గాంధీనే మరి కొంత కాలం అధ్యక్షురాలిగా కొనసాగాలని మన్మోహన్ సింగ్ కోరారు. సిడబ్ల్యూసి సమావేశంలో రాజుకున్న అగ్గి టీ కప్పులో తుఫానులా చల్లారుతుందా లేక ఈ ముసలం పెద్దదిగా మారి పార్టీ అధిష్టానానికి తలనొప్పిగా మారుతుంతో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.