అసలే ప్రతిపక్షం..! ఆపై బలమైన అధికార పక్షం..! ఎమ్మెల్యేలు చేజారుతున్నారు.., మాజీలు అరెస్టవుతున్నారు.., అధినేత ఒత్తిడిలో ఉన్నారు.., యువ నేత ట్విట్టర్ లో ఉన్నారు..! ఈ సమయంలో ఈ సమయంలో టీడీపీకి టానిక్.., మాత్ర.., సిరప్.., అమృతం… ఏమిటి..? కాపాడగలిగేది ఏమిటి..? కష్టాల కడలి నుండి గట్టు ఎక్కించేది ఏమిటి..??
సోషల్ మీడియానే..! అవును. పార్టీని, నాయకుడ్ని బలపరచాలంటే సోషల్ మీడియా పెద్దగా ఉపయోగపడకపోవచ్చు. కానీ.., ఒక పార్టీని బలహీన పరచాలంటే.., ఒక నాయకుడ్ని బజారుకి లాగాలంటే.., బదనాం చేయాలంటే మాత్రం సోషల్ మీడియా బాగా పనికి వస్తుంది. నిజమే.., సోషల్ మీడియా కేవలం నెగిటివ్ ప్రచారానికి మాత్రమే పనికి వస్తుంది. ఎవర్నైనా టార్గెట్ చేసి సోషల్ మీడియాలో బాగా ఫైట్ చేస్తే 75 శాతం ఫలితాలు రాబట్టవచ్చు అనేది సర్వే. అందుకే టీడీపీని దించే క్రమంలో 2014 – 2019 మధ్య వైసీపీ ఎక్కువగా సోషల్ మీడియాపై ఆధారపడింది. లోకేష్ పై, బాబుపై, టీడీపీపై విపరీత రూమర్లు, సెటైర్లు, పుకార్లు సృష్టించి బాగా వాడుకుంది. ప్రతి తప్పుని ఎత్తి జనంలోకి తీసుకెళ్లి కొంత మేరకు సక్సెస్ అయింది. అందుకే ఇప్పుడు టీడీపీ ప్లాన్ కూడా అదే..! కానీ…!!
ఆరు నెలల ప్రణాళిక సిద్ధం…!!
టీడీపీ అధికారంలో ఉండగా వైసీపీ సోషల్ మీడియాని విజయసాయిరెడ్డి లీడ్ చేసేవారు. ఆయన సారధ్యంలో అన్ని జిల్లాల్లోనూ.., రాష్ట్రస్థాయిలోనూ కమిటీలు ఏర్పడ్డాయి. బలంగా పని చేసాయి. ఇప్పుడు టీడీపీ కూడా అదే దశలో ఉంది. ఇప్పటికీ రాష్ట్ర సోషల్ మీడియా టీం ఉంది, లోకేష్ నేతృత్వంలో పని చేస్తుంది. దీంతో పాటూ నియోజకవర్గాలు, జిల్లాలు వారీగా సోషల్ మీడియా బృందాలను తయారు చేస్తుంది. మరో ఆరు నెలల్లో వీటిని పూర్తిస్థాయిలో రంగంలోకి దించనున్నారు. ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో ఇంటర్వ్యూలు నిర్వహించి యూట్యూబ్ ఈఛానెల్ కి జిల్లా స్టాఫ్ ని కూడా తీసుకున్నారు. ఇక జిల్లాల వారిగా పేజీలు, చానెళ్లు మరిన్ని రానున్నాయి. ప్రతి ఆరునెలలకు ఈ బృందాల ప్రణాళిక మారనుంది. వీటిని కేంద్ర కార్యాలయం నుండి లోకేష్ వ్యక్తిగత సోషల్ మీడియా సిబ్బంది ముగ్గురు పర్యవేక్షించనున్నారు.
నిఘా కళ్ళు చూస్తున్నాయ్…!!
టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ సోషల్ మీడియాపై ఒక విభాగం నిఘా ఉండేది. పోస్టింగులపై అక్కడక్కడా కేసులు కూడా పెట్టారు. మరి జగన్ ఊరుకుంటారా..? చంద్రబాబు మూడు తింటే.., జగన్ ఆరు తినే టైపు..!! అందుకే ఇప్పుడు టీడీపీ సోషల్ మీడియాపై నిఘాకు ప్రత్యేక అధికారులు ఉన్నారు. వైసీపీ కార్యాలయంలోనూ విజయసాయి ఆధ్వర్యంలో కొంతమంది బృందం నిత్యం టీడీపీ పేజీలు, చానెళ్లు పరిశీలిస్తూ శృతి మించితే సీఎం పేషీలోని సోషల్ మీడియా నిఘా బృందానికి సమాచారం ఇస్తుంది. మరీ శృతి మించితే వెంటనే నోటీసులు ఇవ్వడం, సాధారణ పోస్టింగులు అయితే పరోక్ష హెచ్చరికలు ఇవ్వడం… ఇంకాస్త ముదిరితే నేరుగా రంగంలోకి దిగి హెచ్చెరికలు ఇవ్వడం… ఇలా ఒక్కో దశకు ఒక్కో విరుగుడుని వైసీపీ సిద్ధం చేసింది. అందుకే టీడీపీ సోషల్ మీడియా కూడా ఇప్పుడు కత్తులు, కోరలు లేకుండా కర్రలతో పోరాడుతుంది. దీన్ని కూడా బీజేపీ ఎంపీ జీవీఎల్ నరికేశారు. తనపై పెట్టిన పోస్టింగులపై ఆయన పిర్యాదు చేయగా ప్రస్తుతం సిఐడి విచారణ చేపట్టింది.