sangam Dairy Case: సంగం డెయిరీ లో అక్రమాలకు పాల్పడ్డారన్న అభియోగంపై టీడీపీ సీనియర్ నేత దూల్లిపాళ్ల నరేంద్ర ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో కస్టడీయల్ విచారణకు హైకోర్టు బ్రేక్ వేసింది. ఏసీబీ అధికారుల విజ్ఞప్తి పై నరేంద్ర ను అయిదు రోజుల పాటు కస్టడీయల్ విచారణ చేసేందుకు ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చింది. దీనితో ఏసీబీ అధికారులు నరేంద్ర ను కస్టడీయల్ విచారణకు జైలు నుండి ఏసీబీ కార్యాలయానికి తరలించారు. శనివారం తొలి రోజు విచారణ ముగిసింది. అనంతరం విజయవాడ సబ్ జైలు కు నరేంద్ర ను తరలించారు.
ఈ క్రమంలోనే నరేంద్ర తరపు న్యాయవాదులు ఏపీ హైకోర్టు లో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. అయిదు రోజుల కస్టడీ కి అనుమతి ఇవ్వడం నిబంధనలకు విరుద్ధమని నరేంద్ర తరపు న్యాయవాదులు కోర్టు కు వివరించారు. దీనితో ఏసీబీ కస్టడీ విచారణపై హైకోర్టు స్టే ఇచ్చింది. సోమవారం పూర్తి స్థాయిలో విచారణ చేపడతామని కోర్ట్ పేర్కొంది. దీనితో ఏసీబీ అధికారుల కస్టడీ విచారణకు బ్రేక్ పడినట్లు అయ్యింది. ధూళిపాళ్ల నరేంద్ర ను నేడు రాజమండ్రి సెంట్రల్ జైలు కు తరలించే అవకాశాలు ఉన్నాయి.