Sasikala.. లాలూ, జగన్, రేవంత్ ను మించిపోయారు శశికళ. వాళ్లకు పదుల కోట్ల ఖర్చుతో స్వాగతం పలికితే.. ఈమెకు వందల కోట్లు ఖర్చయ్యాయి. స్వాగత సత్క్యార్యాలకు నేటి రోజుల్లో అర్ధం మారిపోయింది. వినోదం, క్రీడలు, వ్యాపారం, సైన్యం వంటి రంగాల్లో దేశం పేరు అంతర్జాతీయ యవనికపై గొప్పగా నిలబెట్టారనో, పుట్టిన ఊరికి పేరు తెచ్చారనో, కుటుంబం పేరు ప్రతిష్టలు నిలబెట్టారనో.. స్వాగతం చెప్తారు. ఊరేగింపులు, పూల స్వాగతం, డప్పుల హోరు, ఏనుగు అంబారీ, ప్రజల కేరింతలు, మహిళలు హారతులు పడతారు. ఇది సహజం. ఇందులో విచిత్రం ఏమీ లేదు. కానీ.. ఇందుకు వ్యతిరేకంగా అనేక అవినీతి ఆరోపణల్లో కేసులు ఎదుర్కోవడమే కాదు.. ఏకంగా నెలలు, ఏళ్లపాటు జైల్లో ఉండి బయటకొచ్చిన వారికి కూడా ఇదే తరహా స్వాగత సత్కారాలు జరగడం.. బహుశా భారత్ లో తప్ప ప్రపంచంలో మరెక్కడా జరగదేమో..!
Sasikala శశికళకు ‘అతి’భారీ స్వాగతం..
దివంగత తమిళనాడు సీఎం జయలలిత నెచ్చెలి శశికళ ఉదంతమే ఇందుకు ఉదాహరణ. జయలలిత మరణానంతరం అక్రమాస్తుల కేసులో జైలుకు వెళ్లిన శశికళ ఇటివలే.. జనవరి 27న జైలు నుంచి విడుదలయ్యారు. ఇంకా శిక్షా కాలం ఉండగానే.. 10కోట్లు చెల్లించి మరీ..! అదీ.. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయని మాత్రమే. రాష్ట్రానికి సాయం చేద్దామనో.. ప్రజలకు సేవ చేద్దామనో ఆమె విడుదల అయ్యారు అనేకంటే తమిళనాడు రాష్ట్ర సీఎం కావాలనే లక్ష్యంతో వచ్చారు అనడం సబబుగా ఉంటుంది. అయితే.. ఆమె విడుదల కావడం కంటే ఆమెకు దక్కిన స్వాగత సత్కారాల గురించే ఇప్పుడు దేశం యావత్తూ విస్తుపోతోంది. వ్యక్తి ఆరాధనలో తమకంటే దేశంలో కాదు.. ప్రపంచంలోనే తమకు ఎవరూ సాటిరారు అని తమిళులు మరోసారి నిరూపించారు. బెంగళూరు నుంచి 350 కిమీ దూరంలో ఉన్న చెన్నై చేరుకోవడానికి కారులో ఎంతలేదన్నా 6 గంటల్లో చేరుకోవచ్చు. కానీ.. శశికళకు 23 గంటలు పట్టింది. స్వాగతం పలకొచ్చు.. మహా అయితే.. రెండు కోట్ల ఖర్చుతో. కానీ.. 200 కోట్లు ఖర్చు జరిగింది. అంటే.. గంటకు 8కోట్ల 60లక్షల పైమాటే..!
తమిళ తంబిల తీరే వేరయా..
1996లో జయలలిత దత్త పుత్రుడి పెళ్లికి పెట్టిన ఖర్చు అప్పట్లో దేశం మొత్తం మోగిపోయింది. చెన్నై నగరమంతా పూలు జల్లారు. చెన్నై అంతటా భోజనాలు పెట్టారు. పెళ్లి ఏర్పాట్లు, జయలలిత, శశికళ నగలు, చీరలు ఖర్చు.. ఇలా ఆ సందర్భంలో ఈ ఆడంబరం ఎంతో హాట్ టాపిక్ అయింది. అప్పటి నుంచే వీరిపై అక్రమాస్తుల కేసు నమోదయింది. ఇలా జయలలిత, శశికళ పేర్లు మోగిపోవడం అప్పటినుంచే ప్రారంభమైంది. 2016లో జయలలిత మళ్లీ సీఎం అయితే నాలుక కోసుకుంటానని ఆమె మహిళా అభిమాని ఒకరు మొక్కకున్నారు. అనుకున్నట్టుగానే జయలలిత సీఎం కావడం.. ఆమె అభిమానిని పరామర్శించి ఉద్యోగం ఇప్పించడం అన్నీ జరిగాయి. జయలలితతోపాటు సినీ నటులకు గుళ్లు కట్టడంలో కూడా తమిళనాడు ప్రజలకు ఎవరూ సాటిరారు. సూపర్ స్టార్ అప్పడం, ఖుష్బూ ఇడ్లీ.. వంటి పేర్లతో తమిళనాడులో మోగిపోయాయి. ఇంతటి ఆరాధనే ఇప్పుడు శశికళకు జరుగుతోంది. అన్నాడీఎంకే నుంచి బహిష్కరణకు గురైనా అన్నాడీఎంకే నేతలు ఆమెకు పలికిన స్వాగతం.. అయిన ఖర్చు ఇప్పుడు వార్తల్లో నిలుస్తోంది.
ప్రముఖ రాజకీయ నాయకులకు కూడా..
ఇది శశికళతోనే ప్రారంభం కాలేదు. గడ్డి స్కాంలో జైలుపాలయిన లాలూ ప్రసాద్ యాదవ్ జైలు నుంచి విడుదలైనప్పుడు, 43వేల కోట్ల ఆర్ధిక నేరాల ఆరోపణలతో 16 నెలలు జైలు జీవితం గడిపి విడుదలైన ప్రస్తుత ఏపీ సీఎం జగన్, ఓటుకు నోటు కేసులో జైలు నుంచి బెయిల్ పై విడుదలైన రేవంత్ రెడ్డికి కూడా ఇటువంటి స్వాగత సత్కారాలే జరిగాయి. అంటే.. మంచి పనులకు, గొప్ప కీర్తి సాధిస్తేనే, దేశం పేరు నిలబెడితేనో.. దక్కాల్సిన గౌరవ మర్యాదలు, స్వాగత సత్కారాలు.. ఇప్పుడు జైలు నుంచి వచ్చిన సెలబ్రిటీలకు కూడా దక్కుతున్నాయి. శశికళకు స్వాగతం పలికేందుకు దాదాపు 350 కిమీ మేర ఇటువంటి సత్కారాలు, ఖర్చు చేశారంటే.. ఇదంతా అభిమానులు, కార్యకర్తల సొంత ఖర్చా.. ఏ అక్రమాస్తుల కేసులో జైలుకెళ్లారో అవే.. అక్రమాస్తులు బయటకు తీశారో శశికళకే తెలియాలి. ఈ ఖర్చు నిజమే అయితే.. శశికళపై మళ్లీ మరో అక్రమాస్తుల కేసు నమోదవుతుందేమో..! మొత్తంగా తన ప్రాబల్యం చూపేందుకు, అసెంబ్లీ ఎన్నకల్లో తన హవా చూపేందుకు శశికళ ఎంచుకున్న మార్గం ఆమెకు మాత్రం సుముచితమే..!!