అమరావతి, ఫిబ్రవరి 9: ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం ఢిల్లీలో చేసే ధర్మపోరాట దీక్షకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆదివారం ప్రధాని మోది గుంటూరులో బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ఆయన వచ్చి వెళ్లిన మరుసటి రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీలో ఆయనకు సవాలు విసరనున్నారు.
రాష్ట్రం నుండి పెద్ద సంఖ్యలో ప్రజలు, పార్టీల నేతలు పాల్గొని విజయవంతం చేసేందుకు గాను అనంతపురం, శ్రీకాకుళం జిల్లా కేంద్రాల నుండి ఢిల్లీకి 20బోగీలతో రెండు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారు. ఈ రైళ్లకు అయ్యే ఖర్చు సౌత్ సెంట్రల్ రైల్వేకు చెల్లించడం కోసం సాధారణ పాలనా శాఖ కోటి 12లక్షలు రూపాయలు మంజూరు చేస్తూ జివో ఆర్టి నెం.262 విడుదల చేసింది.
విభజన కారణంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ను అన్ని విధాలుగా కేంద్రం అన్యాయం చేస్తోందని, రాష్ట్రానికి విభజన చట్టంలోని హామీలను సాధించేందుకే కేంద్రంపై పోరాటం చేయాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతూ వస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రం పట్ల దుర్మార్గంగా వ్యవహరిస్తున్నదంటూ అసెంబ్లీలో, బయటా విమర్శలు చేస్తూనే ఉన్నారు.
చంద్రబాబు దీక్షకు జాతీయ స్థాయిలో వివిధ రాజకీయపక్షాలు ఇప్పటికే మద్దతు ప్రకటించాయి. అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ పార్లమెంట్ సాక్షిగా హమీ ఇచ్చిన ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని అంశాల అమలును డిమాండ్ చేస్తూ పార్లమెంట్ వద్దే 11వ తేదీ ధర్మపోరాట దీక్ష చేస్తున్నారు. బిజెపియేతర పార్టీ నేతల కూడా ఈ ధర్మపోరాట దీక్షలో పాల్గొని సంఘీభావం తెలిపే అవకాశం ఉంది.
చంద్రబాబు చేస్తున్న ధర్మపోరాట దీక్షలపై విమర్శలు రాకపోలేదు. దీక్షల పేరుతో చేస్తున్న కార్యక్రమాలకు ప్రజాధనం ఖర్చు చేయడంపై ప్రధాన ప్రతిపక్షం వైసిపితో పాటు బిజెపి కూడా విమర్శలు చేస్తున్నది. ఈ దీక్షలలో చంద్రబాబు బిజెపితో పాటు వైసిపిని కూడా తీవ్రంగా విమర్శిస్తుండడంతో ఆ పార్టీ సహజంగానే ప్రతి విమర్శకు దిగుతోంది. ప్రభుత్వ నిధులతో నిర్వహిస్తున్న దీక్షలు టిడిపి కార్యక్రమాలుగా పరిణమిస్తున్నాయని వైసిపి ఆరోపిస్తున్నది.
వ్యక్తిగత ప్రతిష్ట కోసమో, పార్టీ పటిష్టత కోసమో తాను ఈ ధర్మపోరాట దీక్షలు చేయడం లేదనీ, రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై కేంద్రంను నిలదీసి సాధించుకునేందుకు నిరసనలు తెలియజేస్తున్నానని చంద్రబాబు పేర్కొంటున్నారు.
ప్రభుత్వ జివో కోసం కింద క్లిక్ చేయండి