అమరావతి : తెలుగుదేశం పార్టీ నేతల వరుస అరెస్టులతో ఆంధ్రప్రదేశ్ లో రాజకీయం వేడెక్కుతోంది. తొలుత టీడీపీ శాసనసభ ఉప నేత కింజరవు అచ్చెన్నాయుడు ఈఎస్ఐ అవినీతి కేసులో అరెస్ట్, ఆ తరువాత వెంటనే మాజీ ఎమ్మెల్యేలు చింతమనేని ప్రభాకర్, మాజీ మంత్రి జెసీ దివాకర్ రెడ్ది సోదరుడు ప్రభాకర్ రెడ్ది అరెస్ట్ లతో రాష్టంలో ప్రతిపక్ష, అధికార పక్ష నేతల విమర్శలు, ప్రతి విమర్శలు, నిరసనలతో ఒక్క సారిగా రాజకీయ వాతావరణం హాట్ హాట్ గా మారింది. అధికార పక్షం కక్షపూరితంగా వ్యవహరిస్తోందంటూ టీడీపీ అధినేత చంద్రబాబుతో సహా ఆ పార్టీ నేతలు విమర్శిస్తూ, వైసీపీ ప్రభుత్వ చర్యలను ఖండిస్తున్నారు. ప్రభుత్వ చర్యలను మంత్రులు, వైసీపీ అధికార ప్రతినిధులు, ఆ పార్టీ ఎమ్మెల్యేలు సమర్థిస్తూ మీడియా ముందు మాట్లాడుతున్నారు.
అయితే టీడీపీ నేతల అరెస్ట్ లను ఖండిస్తూ పార్టీ శ్రేణులు నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని చంద్రబాబు పిలుపు ఇచ్చారు. ప్రస్తుత కరోనా లాక్ డౌన్ ఆంక్షల నేపథ్యంలో చంద్రబాబు పిలుపునకు టీడీపీ శ్రేణులు ఆందోళనలు చేపడితే వైరస్ వ్యాప్తి చెందితే ఎవరు బాధ్యత వహిస్తారని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.
చంద్రబాబు పిలుపు మేరకు శుక్రవారం పలు ప్రాంతాల్లో టీడీపీ నేతలు నిరసన కార్యక్రమాలను నిర్వహించారు. నిరసన కార్యక్రమాల్లో టీడీపీ నేతలు, కార్యకర్తలు కరోనా వైరస్ ప్రబలుతున్న విషయాన్నే మరచి మాస్క్ లు ధరించకుండా, భౌతిక దూరం పాటించకుండా పాల్గొన్నారని వైసీపీ శ్రేణులు అంటున్నారు. కరోనా లాక్ డౌన్ నిభందనలను టీడీపీ శ్రేణులు ఉల్లంఘించారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. నిరసన కార్యక్రమంలో ఒకరికి వైరస్ ఉంటే పరిస్థితి ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుత కరోనా నేపథ్యంలో నిబంధనలకు విరుద్ధంగా సామూహిక కార్యక్రమాలకు చంద్రబాబు పిలుపు ఇవ్వడం సబబేనా అని వారు అంటున్నారు. ఒక వేళ వైరస్ ప్రబలితే చంద్రబాబు బాధ్యత వహిస్తారా అని వారు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుత తరుణంలో చంద్రబాబు నిరసన కార్యక్రమాలకు పిలుపు ఇవ్వడం కరెక్టే నంటారా?, పార్టీ శ్రేణులు నిభందనలు ఉల్లంఘించి ఆందోళనలు నిర్వహించడం సబబేనా? మీరే చెప్పండి.