(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
అమరావతి: శాసనమండలి సభ్యులను అగౌరవపరిచే రీతిలో మార్షల్స్ వ్యవహరిస్తున్నారనీ, ఇదే పరిస్థితి కొనసాగితే తాము కౌన్సిల్కు వచ్చే పరిస్థితి ఉండదనీ, మీరే సభను నడుపుకోండని టిడిపి ఎమ్మెల్సీ, మాజీ మంత్రి నారా లోకేష్ శాసనమండలి చైర్మన్ షరీఫ్ను ఉద్దేశించి అన్నారు. మహిళా సభ్యుల పట్ల కూడా మార్షల్స్ అవమానకరంగా ప్రవర్తిస్తున్నారని లోకేష్ ఆరోపించారు. ఎప్పుడూ లేని విధంగా సభ్యులను గేటు వద్దే నిరోధిస్తున్నారని అన్నారు. ప్లోర్ లీడర్లు, లెజిస్లేటివ్ వ్యవహారాల మంత్రి, చీఫ్ మార్షల్ను పిలిపించి మాట్లాడాలని ఆయన డిమాండ్ చేశారు.
లోకేష్ వ్యాఖ్యలపై శాసనమండలి చైర్మన్ షరీఫ్ స్పందించారు. సభ్యుల పట్ల అగౌరవంగా ప్రవర్తించడం అసమంజమని అన్నారు. సభ్యులను అగౌరవపరచకుండా ఉండే విధంగా రూలింగ్ ఇస్తున్నామని చెప్పారు. మహిళా సభ్యులను మహిళా మార్షల్స్, పురుష సభ్యులను మగ మార్షల్స్ తాకకుండా సభకు పంపిచాలని చీఫ్ మార్షల్కు ఆదేశాలు జారీ చేశారు. ప్లోర్ లీడర్లు, లేజిస్లేటివ్ వ్యవహారాల మంత్రి, చీఫ్ మార్షల్ను పిలిపించి మాట్లాడతానని ఆయన హామీ ఇచ్చారు.