విజయవాడ: వైసీపీ ప్రభుత్వ పాలనకు వ్యతిరేకంగా తాను ఒక రోజు దీక్ష చేపట్టనున్నట్టు టీడీపీ అధినేత. మాజీ సీఎం నారా చంద్రబాబునాయుడు ప్రకటించారు. ఈ నెల 14వ తేదీన విజయవాడ వేదికగా దీక్ష జరుగుతుందని, తాను ఉదయం నుంచి రాత్రి వరకూ 12 గంటలపాటు దీక్షలో కూర్చుంటానని వెల్లడించారు. ఇసుక నిల్వలు వరదల్లో కొట్టుకుపోయాయన్న మంత్రి సురేష్ వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యమని, మంత్రులు చేసిన వ్యాఖ్యలు సీఎం జగన్ వ్యాఖ్యానాలే అని అన్నారు. మంగళవారం విజయవాడలో నిర్వహించిన టీడీపీ వర్క్షాప్లో ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వానికి ఏమాత్రం మానవత్వం లేదని మండిపడ్డారు. చనిపోయినవారిని కూడా అవమానించే ప్రభుత్వం ఇదని దుయ్యబట్టారు. ఒక వ్యక్తి మారితే ఇంత అరాచాకమా ? అని ప్రశ్నించారు. చేతకాని పాలనకు ఇసుక కొరత, కార్మికుల ఆత్మహత్యలే ఒక కేస్టడీ అని అన్నారు. రాష్ట్రంలో ఉచిత ఇసుక పాలసీ తీసుకురావాలని, ఇసుక లేకపోవడంతో భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. పనులు లేక కార్మికులు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు.
రాష్ట్రంలో ఇసుక కొరతకు నిరసనగా ఆందోళనలకు శ్రీకారం చుట్టింది టీడీపీయేనని చంద్రబాబు గుర్తు చేశారు. ఆగస్టు 30న, అక్టోబర్ 25 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా నిరసన, ఆందోళనలు చేశామని తెలిపారు. విశాఖలో జనసేన లాంగ్ మార్చ్కు మద్దతిచ్చామని, ప్రజా సమస్యలపై ఎవరు ఆందోళనలు చేసినా టీడీపీ సంఘీభావంగా ఉంటుందని చంద్రబాబు స్పష్టం చేశారు. అప్పట్లో వనజాక్షి అంశంపై వైసీపీ దుష్ప్రచారం చేసిందని చంద్రబాబు విమర్శించారు. డ్వాక్రా మహిళలు, అధికారిణి మధ్య వివాదాన్ని రాజకీయం చేశారన్నారు. వన్ మ్యాన్ కమిషన్ వేసి పరిస్థితిని చక్కదిద్దామన్నారు. టీడీపీ ఐదేళ్ల పాలనలో ఆ ఒక్క ఘటన తప్ప మరో సంఘటన జరగలేదన్నారు. చింతమనేని ప్రభాకర్పై అక్కసుతోనే టీడీపీని టార్గెట్ చేశారని చంద్రబాబు మండిపడ్డారు. ఉచిత ఇసుక పంపిణీ అన్ని సమస్యలకు పరిష్కారమని చంద్రబాబు అన్నారు. భవన నిర్మాణ కార్మికులకు నెలకు రూ.10వేల పరిహారం ఇవ్వాలని, ఆత్మహత్యలు చేసుకున్నవారి కుటుంబాలకు రూ.25లక్షలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జాతీయ జెండాకు వైసీపీ రంగులు వేసి అవమానించారని మండిపడ్డారు. కోడెల ఆత్మహత్య వైసీపీ వేధింపులకు పరాకాష్ట అని అన్నారు. 150 రోజుల్లో 630 అరాచకాలకు పాల్పడ్డారని, చలో ఆత్మకూరు ఆందోళనలతో కార్యకర్తల్లో ధైర్యాన్ని ఇచ్చామన్నారు. కార్యకర్తలపై అక్రమ కేసులను లీగల్ సెల్ సమగ్రంగా పరిశీలిస్తోందని, కార్యకర్తలకు పార్టీ అన్నివిధాలా అండగా ఉంటుందని చంద్రబాబు భరోసా ఇచ్చారు.