అమరావతి: బిజెపి రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి ఒక పక్క వైసిపి అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి, మరో పక్క టిడిపి అధినేత చంద్రబాబులపైనా విమర్శలు గుప్పించారు. ఢిల్లీలో ఆయన మీడియా సమావేశంలో పలు అంశాలను వివరిస్తూ జగన్, చంద్రబాబు వైఫల్యాలను విమర్శించారు.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి బదిలీ చేసిన విధానం ఘోరంగా ఉందనీ, సీనియర్ ఐఏఎస్ అధికారికే ఇలాంటి పరిస్థితి రావడం దారుణమనీ సుజన చౌదరి అన్నారు. కారణాలు ఏమైనా బదిలీ చేసిన విధానం సరికాదని సుజనా పేర్కొన్నారు. ఇది రాచరిక జమానా కాదనీ అంటూ ప్రజాస్వామ్య ప్రభుత్వం ఇలా చేయడం భావ్యం కాదని సుజనా అన్నారు. సీఎస్ స్థాయి అధికారికే ఇలాంటి పరిస్థితి ఉత్పన్నం అయితే మాములు ఉద్యోగుల పరిస్థితి ఏమిటని సుజన ప్రశ్నించారు. అయిదు నెలలుగా అనేక మంది అధికారులకు పోస్టింగ్ లు లేకుండా హోల్డ్ ఉంచారని సుజనా అన్నారు. సామాజిక వర్గాలుగా సమాజాన్ని విభజించే ప్రయత్నాన్ని చేస్తున్నారని సుజనా విమర్శించారు.
వరదల నియంత్రణలో, ఇసుక కొరతపై చర్యలు తీసుకోవడంలో జగన్మోహనరెడ్డి ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యిందని అన్నారు.
పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే వారపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారే తప్ప సమస్య పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలుశూన్యమని సుజనా అన్నారు. వైసిపి నాయకులు ఎన్నికలు అయిపోయాయనే విషయాన్ని గుర్తిస్తే మంచిదని సుజనా పేర్కొన్నారు. మీడియా మీద ఆంక్షలు తీసుకురావడం దారణమని సుజనా అన్నారు. రాష్ట్రంలో లిక్కర్ పాలసీని మార్చడం వల్ల ఆదాయం ఏమన్నా పెరిగిందా అని సుజనా ప్రశ్నించారు. లిక్కర్ ధరలు పెరగడంతో సామాన్యులపై భారం పడుతోందని సుజనా అన్నారు.
రివర్స్ టెండరింగ్ చేశారు కానీ పోలవరం అథారిటీ నుంచి ఇంత వరకూ అనుమతి లభించలేదని సుజనా అన్నారు.రాష్ట్రంలో 75 శాతం స్థానికులకే ఉద్యోగలంటూ రిజర్వేషన్లు తీసుకొచ్చారనీ ఇది రాజ్యాంగ విరుద్దమనీ సుజనా అన్నారు. నూతన రిజర్వేషన్లు తీసుకొచ్చిన తరువాత ఒక్క కొత్త పరిశ్రమ కూడా రాష్ట్రానికి రాలేదని సుజనా పేర్కొన్నారు. అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలు పారిపోయే పరిస్థితి వచ్చిందని సుజనా అన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరవాలని సుజనా హితవుపలికారు.రాష్ట్రంలో వైసిపి,టిడిపి రెండు తమకు ప్రత్యర్ధులేనని సుజనా పేర్కొన్నారు.
గత ప్రభుత్వం లెక్కకు మించి శంకుస్థాపనలు చేసి ప్రాజెక్టుల నిర్మాణంలో కాలయాపన చేసిందని సుజనా విమర్శించారు. రాజధానిపై గెజిట్ నోటిఫికేషన్ రానందునే కేంద్ర హోంశాఖ ముద్రించిన నూతన మ్యాప్లో అమరావతి పేరు లేదని సుజనా వివరించారు. అమరావతి గెజిట్ నోటిఫికేషన్ చేయడంలో చంద్రబాబు ఫెయిల్ అయ్యారని సుజనా అన్నారు. చంద్రబాబు తప్పుల మూలంగానే వైసిపి అధికారంలోకి వచ్చిందనేది సుజనా అభిప్రాయపడ్డారు. వైసిపి పాలనపై ప్రజలు సంతోషంగా లేరని సుజనా చౌదరి అన్నారు.