హైదరాబాద్: మాజీ మంత్రి, సీనియర్ టిడిపి నేత టి దేవేందర్ గౌడ్ తనయుడు వీరేందర్ గౌడ్ పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి, తెలుగుయువత అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుకు సోమవారం ఆయన లేఖ రాశారు. టిడిపిలో తనను ఎంతగానో ఆదరించి, అవకాశాలు కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. అదే సందర్భంలో పార్టీపై కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. ఉన్నత ఆదర్శాలు, సిద్ధాంతాలతో దివంగత నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ స్థాపిస్తే కొంత కాలంగా వివిధ రాజకీయ అవసరాల కోసం ఈ సిద్ధాంతాలకు భిన్నంగా తెలుగుదేశం పార్టీ రాజీపడిందనీ, ఇది తనను ఎంతగానో కలచివేసిందనీ వీరేందర్ గౌడ్ వ్యాఖ్యానించారు. పార్టీకి సిద్ధాంతాలు లేకపోవడం అన్నది ఆత్మ లోపించడమేనని ఆయన అన్నారు.