కడప: కేంద్ర ఎన్నికల కమిషన్ తానా అంటే బిజెపి,వైసిపి పార్టీలు తందానా అని వంతపాడటం శోచనీయమని కాంగ్రెస్ పార్టీ పిసిసి ఉపాధ్యక్షుడు తులసిరెడ్డి వ్యాఖ్యానించారు. తులసిరెడ్డి బుధవారం కడప జిల్లా వేంపల్లెలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
దేశంలోని 23 రాజకీయ పార్టీలు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల ద్వారా కాకుండా బ్యాలెట్ పేపర్ పద్దతిలోనే భవిష్యత్తులో ఎన్నికలు జరపాలని డిమాండ్ చేస్తున్నాయని తులసి రెడ్డి తెలిపారు. ఈ ఎన్నికలకు సంబంధించి వివిప్యాట్ స్లిప్పులను లెక్కించాలని కోరుతున్నాయనీ, కానీ ఎన్నికల సంఘం మొండిగా, నిరంకుశంగా తిరస్కరించటం దురదృష్టకరమని తులసి రెడ్డి అన్నారు. వివిప్యాట్ స్లిప్పులు లెక్కించనప్పుడు వాటిని ఎందుకు ప్రవేశ పెట్టారని తులసి రెడ్డి ప్రశ్నించారు.
ప్రపంచంలో 191 దేశాలుండగా అందులో 173 దేశాల్లో బాలెట్ పేపర్ పద్ధతిలో ఎన్నికలు జరుగుతున్నాయని తులసి రెడ్డి తెలియజేసారు. అందులో అమెరికా, జర్మనీ వంటి అభివృద్ధి చెందిన దేశాలున్నాయని తులసి రెడ్డి పేర్కొన్నారు. కొన్ని దేశాలు కొన్నాళ్ళు ఈవిఎంలు వాడి లోపాలు ఉన్నాయని గ్రహించి తిరిగి బ్యాలెట్ పేపర్ పద్దతిలో ఎన్నికలు నిర్వహిస్తున్నాయని ఆయన గుర్తు చేశారు.